విచిత్రం: హనీప్రీత్, గుర్మీత్ లను అమ్మేశారు.. అదీ రూ.11 వేలకే..
హనీప్రీత్, గుర్మీత్ రామ్ రహీమ్ లను ఓ వ్యక్తి ఏకంగా అమ్మేశాడు. అదీ రూ.11 వేలకే! అయోమయంగా ఉందా? అదేంటీ.. తండ్రీకూతుళ్లం అని చెప్పుకునే వాళ్లిద్దరూ జైలులో ఉన్నారు క దా! వాళ్లని అమ్మేయడం ఏమిటంటారా?.
భోపాల్: హనీప్రీత్, గుర్మీత్ రామ్ రహీమ్ లను ఓ వ్యక్తి ఏకంగా అమ్మేశాడు. అదీ రూ.11 వేలకే! అయోమయంగా ఉందా? అదేంటీ.. తండ్రీకూతుళ్లం అని చెప్పుకునే వాళ్లిద్దరూ జైలులో ఉన్నారు క దా! వాళ్లని అమ్మేయడం ఏమిటంటారా?.. అయితే ఇక్కడ అమ్మానికి వచ్చింది నిజంగా గుర్మీత్ సింగ్, హనీప్రీత్లు కాదు. వాళ్ల పేర్లు కలిగి ఉన్న రెండు గాడిదలు!
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన ఒక గాడిదల సంతలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హనీప్రీత్ అనే రెండు గాడిదలు అమ్మకానికి వచ్చాయి. రాజస్థాన్ కు చెందిన హరి ఓం ప్రజాపత్ డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ పేరును, అతడి 'దత్తపుత్రిక' పేరును తన గాడిదలకు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. చివరికి రెండింటినీ రూ.11,000 కు అమ్మేశాడు.
వాళ్ల పేర్లు పెట్టి తన గాడిదలను మంచి రేటుకు అమ్ముకుందామని అతడు ప్రయత్నించాడు. హనీప్రీత్- గుర్మీత్ లను కనీసం ఇరవై వేల రూపాయలకు అమ్మాలని అతడు భావించినా, అవి అంత రేటు పలకలేదట. చివరకు రూ,.11వేలకే అమ్మవలసి వచ్చింది.
ఈ గాడిదల సంతలో ఇంకా మరికొన్ని సెలబ్రిటీ గాడిదలు కూడా అమ్ముడుపోయాయి. జీఎస్టీ, బాహుబలి, సుల్తాన్, జియో తదితర పేర్లను పెట్టి గాడిదలను అమ్మారు వ్యాపారులు! మొత్తానికి తెలివైన వారే ఈ గాడిదల వ్యాపారులు!