ఏం పాపం చేశానో రాజకీయాల్లోకి వచ్చా: మనోహర్ జోషి
వారణాసి: తాను ఏం పాపం చేశానో రాజకీయాల్లోకి వచ్చానని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, పార్లమెంటు సభ్యుడు మురళీ మనోహర్ జోషి వాపోయారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ.. బిజెపిలో అగ్రనాయత్వంలో ఒకరిగా కొనసాగుతున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన బుధవారం తన నియోజక వర్గమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఓ భజనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాను ఒక సైన్స్ విద్యార్థి అయివుండి రాజకీయాల్లో ఇరుక్కుపోయానని చెప్పారు. భక్తి సంగీతం విన్నప్పుడే తాను మనుషుల మధ్యే ఉన్నానన్న స్పృహ కలుగుతుందని మురళీ మనోహర్ జోషి చెప్పారు.
ప్రస్తుతం వారణాసి పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేటాయించాలని పార్టీలో ఒక వర్గం భావిస్తున్న విషయం తెలిసిందే. రెండు లోకసభ స్థానాలను నుంచి నరేంద్ర మోడీ పోటీ చేయనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఓ స్థానం నుంచి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. మోడీ వారణాసి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆయన అభిమానులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు బిజెపి గెలుచుకుంటుందని ఇంతకుముందు నిర్వహించిన పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. కాగా వారణాసి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న మురళీ మనోహర్ జోషికి ఆ స్థానాన్ని వదులుకోవడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. మురళీ మనోహర్ జోషి అలహాబాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు, వారణాసి నుంచి ఒక సారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.