పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బయటి నుంచి వచ్చిన శక్తులే ఈ హింసకు కారణమని.. రైతు ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో ఇది భాగమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నటుడు,సింగర్ దీప్ సిధు పైనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను ఎర్రకోట వైపు మళ్లించి... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి దీప్ సిధునే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరోజు ఏం జరగబోతుందో : దీప్ సిధు
ట్రాక్టర్ ర్యాలీకి సరిగ్గా వారం రోజుల ముందు దీప్ సిధు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. 'పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్తో(కథ ఇంకా మిగిలే ఉంది).' అని సిధు అందులో పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. అంతకుముందు,జనవరి 23న ఓ పంజాబీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జనవరి 26న ఏం జరగబోతుందో... అది మా అంచనాలకు అందకుండా ఉంది. ఊహించడం కూడా కష్టమే. అది ఆ భగవంతుడికే తెలియాలి. మానవమాత్రులం మనమేమీ చెప్పలేం.' అని అందులో పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన సిధు...
మరోవైపు ట్రాక్టర్ ర్యాలీ రోజు రైతులను తానే రెచ్చగొట్టానన్న ఆరోపణలను దీప్ సిధు ఖండించారు. తాను భావోద్వేగాలను రెచ్చగొట్టలేదన్నారు. భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గుర్నమ్ సింగ్ చదునిపై వస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా దీప్ సిధు ఆయన్ను సమర్థించే ప్రయత్నం చేశారు. 'శత్రువుతో కూర్చొన్నా సరే... మన మనిషి పట్ల మనకు నమ్మకం ఉండాలి. నా విషయంలోనూ ఇదే జరిగింది. సన్నీ డియోల్ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు... నాపై బీజేపీ,ఆర్ఎస్ఎస్ ముద్ర వేశారు. ఇప్పుడు గుర్నమ్ సింగ్ను కూడా అనుమానిస్తున్నారు. అభిప్రాయ బేధాలు ఉండటంలో తప్పులేదు. కానీ దాని అర్థం ఎవరినైనా సరే మేము శత్రువు మనిషిగానే చూస్తానడం సరికాదు.' అని దీప్ సిధు అభిప్రాయపడ్డారు.
Recommended Video
ఐక్యతతో ట్రాక్టర్ ర్యాలీ సాగాలని...
ట్రాక్టర్ ర్యాలీని ఉద్దేశించి జనవరి 22న దీప్ సిధు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. 'అన్ని రైతు సంఘాలకు నేనో విజ్ఞప్తి చేస్తున్నాను. మన మధ్య విభేదాలను పక్కనపెట్టి జనవరి 26న మనమంతా ఒక్కటవ్వాలి. ఎంతలా అంటే మన మధ్య నుంచి గాలి కూడా దూరేంత స్పేస్ ఇవ్వరాదు. గురు గ్రంథ్ సాహిబ్ ప్రేరణతో స్పూర్తి పొంది మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలి.' అని సిధు పిలుపునిచ్చారు.