పూర్తిగా చదవండి: నిర్మల సీతారామన్, 'రాహుల్ గాంధీ! మీరు ఏబీసీల నుంచి ప్రారంభించాలి'
న్యూఢిల్లీ: హెచ్ఏఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) పైన తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం లోకసభలో అన్నారు. హెచ్ఏఎల్ పైన అనుమానాలు అనేది అందర్నీ తప్పుదారి పట్టించడమే అన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. 2014-18 మధ్య హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య 26 వేల కోట్ల ఒప్పందాలు పూర్తయ్యాయని, మరో రూ.73వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.
83 తేజస్ విమానాల కోసం రూ.50 వేల కోట్లు, 200 హెలికాప్టర్ల కోసం రూ.20 వేల కోట్లు, 19 డోర్నియర్ విమానాల కోసం రూ.3,400 కోట్లు, ఇతర హెలికాప్టర్ల కోసం రూ.15,000 కోట్లు, ఏరో ఇంజిన్ల కోసం రూ.8,400 కోట్లు కేటాయించామన్నారు. ఈ పనులన్నీ హెచ్ఏఎల్కే అప్పగించనున్నట్టు తెలిపారు.
అంతకుముందు ఆదివారం, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ నిర్మల సీతారామన్ పార్లమెంటులో అబద్దం చెప్పారని, ఒక అబద్దం చెబితే దానిని కప్పిపుచ్చేందుకు మరిన్ని అబద్దాలు సృష్టించవలసి ఉంటుందని, ప్రధాని మోడీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో చెప్పిన అబద్దాలను సమర్థించే ఆతృతలో ఆమె లోకసభలో అబద్దాలు చెప్పారని, హెచ్ఏఎల్కు ప్రభుత్వం ఇచ్చిన లక్ష కోట్ల రూపాయల విలువైన ఆర్డర్స్కు సంబంధించిన పత్రాలను ఆమె లోకసభలో సోమవారం ప్రవేశపెట్టాలని లేదంటే ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ ట్వీట్తో పాటు ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిన హెచ్ఏఎల్కు సంబంధించిన వ్యాసాన్ని పోస్ట్ చేశారు.
దీనిపై నిర్మల వెంటనే స్పందించారు. మీరు (రాహుల్ గాంధీ) ప్రస్తావిస్తున్న పత్రికలోని వ్యాసాన్ని దయచేసి పూర్తిగా చదవాలని, ఆ వ్యాసంలో ఇలా ఉందని అందులో ఉన్న దానిని నిర్మల పేర్కొన్నారు. 'లోకసభ రికార్డులు చూపిస్తున్నదాని ప్రకారం, ఆర్డర్స్పై సంతకాలు జరిగినట్లు సీతారామన్ చెప్పలేదు, వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు చెప్పారు' అని రాసి ఉందని, పూర్తిగా చదివి తెలుసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ఆ వెంటనే రక్షణ శాఖ కూడా ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ గారూ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలని, వ్యాసాన్ని పూర్తిగా చదవకుండానే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్ వేసింది. ఆ తర్వాత లోకసభలో తప్పుదారి పట్టిస్తున్నట్లు నిర్మల చెప్పారు.