లవ్ అఫైర్స్ వల్లే రైతుల ఆత్మహత్యలు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అన్నదాతల ఆత్మహత్యల విషయంలో కేంద్ర మంత్రి ఒకరు నోరు జారారు. స్వయానా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లిఖితపూర్వకంగా రైతుల ఆత్మహత్యల పై ఇచ్చిన సమాధానం బీజేపీని ఇరుకున పడేసింది.
శుక్రవారం రాజ్యసభలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేమ వ్యవహారం, వరకట్నం సమస్య, పిల్లలు పుట్టుకపోవడం తదితర కారణాల వలనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు.
అయితే అందులో ఆర్థిక సమస్య, అప్పులు ఉన్నాయని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ నేర విభాగం రికార్డుల బ్యూరో ప్రకారం కుటుంబ సమస్యలు, అనారోగ్యం, డ్రగ్స్, వరకట్నాలు, ప్రేమ వైఫల్యాల కారణాల వలనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాధామోహన్ సింగ్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రంలా మారాయి. భూ సేకరణ చట్టంపై బీజేపీ మీద మండిపడుతున్న ప్రతిపక్షాల చేతికి బలమైన అస్త్రం ఇచ్చి బీజేపీ పెద్ద ఇరకాటంలో పడింది.
అమ్ ఆద్మీ పార్టీ ర్యాలి సందర్బంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సమయంలో హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధనకర్ (బీజేపీ) ఆత్మహత్య చేసుకునే రైతులు నేరస్తులు, పిరికివారు అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వారి బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శిచారు.
2014వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 5,650 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 5,178 మంది పురుషులు, 472 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర, తెలంగాణ, చత్తిస్ గడ్ రాష్ట్రాలలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని రికార్డులు చెబుతున్నాయి.