ఢాకా ఉగ్రదాడికి స్ఫూర్తి!: డాక్టర్ నుంచి మత బోధకుడిగా, ఎవరీ జకీర్ నాయక్?
ముంబై: ఇటీవలే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు భారత్కు చెందిన ఇస్లామిక్ మత గురువు నుంచే స్ఫూర్తి పొందినట్లు బంగ్లాదేశ్ భద్రతాధికారులు విచారణలో వెల్లడవడంతో జాతీయ దర్యాప్తు అధికారులు (ఎన్ఐఏ) అతడిపై దృష్టి సారించారు.
వివరాల్లోకి వెళితే ఢాకా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన రోహన్ ఇంతియాజ్.. ముంబైకు చెందిన ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందినట్లు తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. దీంతో ఎన్ఐఏ అధికారులు జకీర్ నాయక్కు సంబంధిన ప్రసంగాల వీడియోలన్నింటిని పరిశీలిస్తున్నారు.
మరో ఉగ్రవాది నిబ్రస్ ఇస్లాం.. బెంగళూరుకు చెందిన మెహదీ మస్రూర్ బిస్వాస్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయినట్లు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. ఐసిస్కు భారత్లో అనకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నందున మెహదీ మస్రూర్ బిస్వాస్ (24)ను 2014 డిసెంబర్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఢాకా ఉగ్రదాడితో జకీర్ నాయక్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తిని కనబరుస్తున్నారు. ముంబైకి చెందిన జకీర్ నాయక్ (51) వృత్తిరీత్యా డాక్టర్. అయితే యావత్ భారతావనికి గత 20 ఏళ్లుగా ఆయన ఓ మత బోధకుడిగా సుపరిచితం. 1991లో ముంబైలో ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్ను స్థాపించారు.
ఆ తర్వాత 2006లో పీస్ టీవీ అనే ఇంగ్లిష్ చానల్ను ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది వీక్షించే ఇస్లామిక్ చానల్ ఇదే. ఆ తర్వాత పీస్ టీవీ ఉర్దూ, పీస్ టీవీ బంగ్లా, పీస్ టీవీ చైనీస్ చానళ్లను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతూ జకీర్ నాయక్ మత బోధనలు చేస్తుంటారు.
భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లో పీస్ టీవీలో జకీర్ నాయక్ చేసే మత బోధనలకు విపరీతమైన స్పందన ఉంటుంది. జకీర్ నాయక్ చేసే మత బోధనల్లో ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి. 'ముస్లింలు అందరూ ఉగ్రవాదులుగా మారాలి' లాంటి వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తుంటారు.
గతంలో కరుడుగట్టిన ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ను ఉగ్రవాది అంటే అంత ఎత్తున లేచే జకీర్ ఇస్లాం వ్యతిరేకులపై పోరాడే నాయకుడిగా అభివర్ణించడం విశేషం. అంతేకాదు 9/11 అమెరికా ట్విన్ టవర్ల దాడికి కారణం జార్జి బుష్ అని ఆరోపించారు.
మరోవైపు పీస్ టీవీకి ఇండియాలో ఎలాంటి లైసెన్సులూ మంజూరు చేయలేదు. దుబాయ్ నుంచి అప్ లింక్ అవుతున్న ఈ చానల్ భారత ఉపఖండంలో కేబుల్ ఆపరేటర్ల ద్వారా సులువుగానే ప్రసారం అవుతోంది. భారత సమాచార శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ చానల్ ప్రసారాలు సాగుతున్నాయని అధికారులు కనుగొన్నారు.
దీంతో భారత్లో పీస్ ఛానెల్కు చెక్ పెట్టే పనిలో పడ్డారు. నాయక్ చేసిన ప్రసంగాలన్నింటినీ పరిశీలించాలని, వాటిల్లో అభ్యంతర మాటలుంటే కేసులు పెట్టాలని నిర్ణయించారు. లైసెన్సులు లేని చానళ్లను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.