ట్రిపుల్ తలాక్ చెప్తే మూడేళ్ళ జైలు! ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు..
ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చే వ్యక్తులకు మూడేళ్ల జైలుశిక్ష్ పడనుంది. ఈ మేరకు ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ : ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది.
తలాక్ అని వెంట వెంటనే మూడుసార్లు చెప్పి, భార్యకు విడాకులిచ్చే వ్యక్తికి గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష విధించేందుకు ఈ ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే జమ్మూ-కశ్మీరు మినహా అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లోకి వస్తుంది. నోటి మాటలు, రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నిషేధిస్తూ ఈ ముసాయిదా చట్టం రూపొందింది.
వెంట వెంటనే మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడం అధికార రీత్యా జోక్యం చేసుకోదగిన నేరంగా పరిగణించారు. ఈ విధంగా విడాకులిచ్చే భర్తకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలుశిక్షతోపాటు జరిమానా విధించేందుకు ప్రతిపాదించారు.
వేధింపులకు గురైన ముస్లిం మహిళకు, ఆమెపై ఆధారపడిన పిల్లలకు, తగిన భత్యం చెల్లించాలని ఆదేశించేందుకు అవకాశం కల్పించారు. అటువంటి భార్యకు మైనర్ పిల్లల కస్టడీ హక్కులను కల్పించేందుకు ప్రతిపాదించారు.
2017 ఆగస్టులో సుప్రీంకోర్టు మైలురాయిలాంటి తీర్పునిచ్చింది. వెంట వెంటనే మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులిచ్చే ఆచారం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రుల బృందమే ఈ ముసాయిదా బిల్లును రూపొందించింది.