బాబా రాందేవ్కు షాక్: పడిపోయిన పతంజలి ఉత్పత్తుల సేల్స్..ఎందుకో తెలుసా?
ప్రముఖ యోగా గురువుకు సంబంధించిన ఆయుర్వేద సంస్థ పతంజలి సేల్స్ క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది తమ ఉత్పత్తుల్లో 100శాతం పెరుగుదల నమోదు చేసిన పతంజలి ప్రస్తుతం పడిపోయే దిశగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లో కొత్తగా వస్తున్న ఉత్పత్తులు కూడా పతంజలి ఉత్పత్తులకు గట్టి పోటీనిస్తున్నాయి.
కంటర్ వరల్డ్ ప్యానెల్ అనే సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు పతంజలి ఉత్పత్తుల్లో కేవలం 7శాతం పెరుగుదల మాత్రమే కనిపించిందని వెల్లడించింది. అదే 2016-17 ఆర్థిక సంవత్సరంలో పతంజలి సేల్స్ 52శాతం నమోదు అయ్యాయని తెలిపింది. గతేడాది మొత్తంలో టూత్ పేస్ట్, తేనె ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో అధికంగా అమ్ముడుపోయాయని నివేదిక తెలిపింది. అంబిట్ క్యాపిటల్ అనే మరో సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం పతంజలి ఉత్పత్తులైన హెయిర్ ఆయిల్, షాంపూ, బటర్ సేల్స్ విపరీతంగా పడిపోయాయి.
పతంజలి ఉత్పత్తుల సేల్స్ మార్కెట్లో విపరీతంగా పడిపోవడానికి కారణం ఆ ఉత్పత్తులు లభించకపోవడమేనని ఓ సీనియర్ మేనేజర్ చెప్పారు. ఒక కస్టమర్ వచ్చి ఒక ఉత్పత్తి కావాలని అడిగినప్పుడు ఆ సమయంలో అందుబాటులో లేకుంటే... కస్టమర్ మరో దుకాణంకు వెళ్లి తనకు కావాల్సిన ప్రాడక్ట్ను కొంటాడని చెప్పారు. అదే ఇప్పుడు పతంజలి విషయంలో కూడా జరుగుతోందని వివరించారు. గత పదేళ్లలో పతంజలి ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోవడానికి కారణాలు రెండున్నాయన్న ఆయన... ఒకటి వస్తువుకు వెల కట్టడం, రెండోది దాన్ని పలురకాలుగా మార్కెటింగ్ చేసుకోవడమని చెప్పారు. అయితే ప్రాడక్ట్ దుకాణాల్లో దొరకనప్పుడు ఇలాంటివి ఎన్ని చేసే ఏమి లాభమని మేనేజర్ ప్రశ్నించారు.
పతంజలి లాంచ్ చేసిన మెసేజింగ్ యాప్ కింబో కూడా సక్సెస్ దిశగా పయనించలేదు. వాట్సాప్కు ధీటుగా దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ కస్టమర్ల నుంచి అనుకున్నంత స్థాయిలో ప్రాచుర్యం పొందలేదు. ఇక జీఎస్టీ అమలులోకి రావడంతో ఒక్కసారిగా పతంజలి ప్రాడక్ట్స్ సేల్స్ నేలచూపులు చూశాయి. పతంజలితో పోలిస్తే HUL,ITC,నెస్లీ కంపెనీలు రెండంకెల పెరుగుదలను గత ఆర్థిక సంవత్సరంలో నమోదు చేశాయి. అంతేకాదు పతంజలి ప్రతి ఉత్పత్తి రంగంలో తలదూర్చడంతో అనుకోని నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని కొందరు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు పతంజలి నుంచి వచ్చిన ఆయుర్వే మందుల నుంచి గృహానికి కావాల్సిన అన్ని వస్తువులు, ఆహార పదార్థాలు కూడా ఉత్పత్తి చేయడంతో అది కాస్త బ్యాక్ ఫైర్ అయ్యిందని చెప్పారు. 1997లో పతంజలి ఒక చిన్న ఫార్మసీతో మొదలు పెట్టి ఆ తర్వాత డజనుకు పైగా FMCG ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు వస్త్రరంగం, డైరీ ప్రాడక్ట్స్, ఉత్పత్తి చేసే యోచనలో కూడా పతంజలి ఉంది. అయితే ఇలా నష్టాలు చవిచూసినప్పటికీ... తిరిగి పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేసింది పతంజలి యాజమాన్యం. ప్రపంచ స్థాయిలో తమ ఉత్పత్తులు ప్రాచుర్యం పొందేలా తమ మేనేజ్మెంట్ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు పతంజలి ప్రతినిధి.
ఇదిలా ఉంటే పతంజలి ఉత్పత్తులను తలదన్నేలా డాబర్, హిమాలయా , ఇతర ఎమ్ఎన్సీలు రంగ ప్రవేశం చేశాయి. అవి కూడా ఆయుర్వేదం, హెర్బల్ ఉత్పత్తులను తయారు చేస్తుండటంతో పతంజలి కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఉదాహరణకు హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఆయుష్ బ్రాండ్ పేరు మీద పర్సనల్ కేర్ ప్రాడక్ట్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని హిదుస్తాన్ యూనీలివర్ యాజమాన్యం చెబుతోంది. అయితే ఇప్పటి వరకు మార్కెట్లో తన హవా సాగించిన బాబా రాందేవ్ పతంజలి ఉత్పత్తులు ఇక ఎలాంటి అడుగులు తీసుకుంటుందో వేచి చూడాలి.