నగరాల్లో ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు రెడీ అయిన బుల్లి వాహనాలు
భువనేశ్వర్ : ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు ఇరుకు ఇళ్లలో నక్కి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇరుకున ఉండి దాడిచేసే ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు డీఆర్డీఓ ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించింది. దీన్ని యాంటీ టెరరిస్టు వెహికల్ అని పిలుస్తారు. ఇది నగర నడిబొడ్డున జరిగే ఉగ్రదాడుల సమయంలో వినియోగిస్తారు. ఇక ఈ వాహనంలో ముగ్గురు సైనికులు ప్రయాణిస్తారు. ఒకరు వాహనం నడుపుతుండగా మరో ఇద్దరు ఆపరేషన్ నిర్వహిస్తారు.
ఇక ఈ యాంటి టెరరిస్ట్ వెహికల్ బరువు మూడు టన్నులు ఉంటుంది. ఇందులో కొన్ని చిన్న సైజు ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు మోసుకెళ్లే వీలుంటుంది. ఇక ఈ వాహనం ఇరుకుగా ఉండే రహదారుల్లో అపార్ట్మెంట్ల మధ్య సునాయాసంగా ప్రయాణించగలదు. ఇక ఈ వాహనంను తయారు చేసిన డీఆర్డీఓ దీనికి సంబంధించిన టెక్నాలజీ కావాలంటే భారతీయ పరిశ్రమలు తమ ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కోరింది. ఆసక్తిగల పరిశ్రమలకు ఈ టెక్నాలజీ బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. యాంటీ టెరరిస్టు వెహికల్ ట్రయల్ వర్షన్ విడుదలైందని ఇక ఉత్పత్తిని ప్రారంభిస్తామని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
యాంటీ టెరరిస్టు వెహికల్ ట్రాక్పై టైర్లపై ప్రయాణించేలా రూపొందించారు. అంతేకాదు శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఇలాంటి వాహనం ఒకటి తయారు చేయాలని భావించి డీఆర్డీఓ రూపొందించింది. కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ వాహనానికి తుదిరూపు ఇచ్చినట్లు డీఆర్డీఓ వివరించింది.ఈ వాహనంలో ఆరు ఫైరింగ్ పోర్టులు ఉన్నాయి.ఇక అత్యవసర సమయాల్లో సైనికులు పైన ఉన్న కప్పును తొలగించి బయటకు దూకేలా డిజైన్ చేశారు. ఇక అతితక్కువ స్థలంలోనే ఇది రౌండ్ వేయగలదు. పట్టణ ప్రాంతాల్లో ఉగ్రదాడులను తిప్పి కొట్టేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్డీఓ పేర్కొంది.ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఏడు అంగుళాలు ఎత్తున్న మెట్లను సునాయాసంగా ఎక్కగలదు.