డీఆర్డీఓ మరో ఘనత: క్షిపణి ప్రయోగాల్లో చారిత్రక ముందడుగు: హైస్పీడ్ ఏరియల్ టార్గెట్
న్యూఢిల్లీ: రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో ఘనతను సాధించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన అభ్యాస్ క్షిపణి వాహక నౌక పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ పరీక్షలను నిర్వహించింది. అభ్యాస్ పేరుతో రూపొందించిన క్షిపణులను ప్రయోగించడానికి అవసరమయ్యే గగనతల వాహనాలను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
Recommended Video
వుహాన్ ల్యాబ్లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు
హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్)గా ఈ వాహనాలను పిలుస్తారు. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించడం, వాటిని ప్రయోగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. బాలాసోర్లోని చాందీపుర్లో డీఆర్డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగాన్ని డీఆర్డీఓ అధికారులు చేపట్టారు. ఇది విజయవంతమైనట్లు ప్రకటించారు. అభ్యాస్ క్షిపణి వాహక పరీక్షల పరంపరలో ఇది రెండవది.
ఇదివరకు గత ఏడాది మేలో ఇలాంటి ఫ్లైట్ టెస్టింగులను డీఆర్డీఓ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మొదటి పరీక్షల కంటే.. ఆ సారి మరిన్ని మెరుగైన ఫలితాలు వెలువడ్డాయి. అన్ని రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చనే విషయం తాజా పరీక్షల ద్వారా వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భూమి ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లగలిగే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని, 0.5 మ్యాక్.. అంటే శబ్దంలో సగం వేగంతో ఈ వాహక నౌక ప్రయాణించగలదని తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు అదే వేగంతో ప్రయాణించగలదని, నిర్దేశిత సంకేతాల మేరకు 2జీ టర్న్ తీసుకోగలదని వివరించారు.
డీఆర్డీఓలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎష్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభ్యాస్ క్షిపణి వాహక నౌకను రూపొందించింది. గ్యాస్ టర్బయిన్ను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. మైక్రో-ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ (ఎంఈఎంఎస్)తో దీన్ని నావిగేట్ చేస్తారు. ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ వ్యవస్థతో దీన్ని అనుసంధానించారు. అభ్యాస్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతంతో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందని అన్నారు.