భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్
డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీఓ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలెరీ గన్ సిస్టం (ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు..
Recommended Video
ఒడిశాలో శనివారం నిర్వహించిన ఈ పరీక్షలు విజయవంతం అయ్యాయి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించేలా ఏటీఏజీఎస్ తుపాకీని తయారు చేశారు. ప్రపంచంలోనే ది బెస్ట్ హోవిట్జర్ గన్ గా దీనిని అభివర్ణిస్తున్నారు డీఆర్డీఓ సైంటిస్టులు.
2016 నుంచి డీఆర్డీఓ శాస్త్రవేత్తలు ఏటీఎజీఎస్ తుపాకుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా, భారత్ ఫోర్జ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఇందులో భాగస్వామిగా పనిచేస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ ఆయుధాన్ని దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర తెలిపారు. అంతర్జాతీయస్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మన దేశానికి లేదన్నారు.
భారత్ అమ్ములపొదిలోని సూపర్ గా భావించే ఏటీఏజీఎస్ తుపాకులను డీఆర్డీఓ ఇప్పటికే దేశీయంగా పలుచోట్ల పరీక్షలు జరపగా, తాజాగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద కూడా టెస్టులు నిర్వహించి, శత్రువులకు సవాలు విసిరింది. ఈ తరహా తుపాకులు నిమిషానికి మూడు రౌండ్ల కాల్పులు మాత్రమే జరిపితే ఏటీఏజీఎస్ మాత్రం నిమిషానికి ఐదు రౌండ్ల కాల్పులు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా తుపాకులు భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.