ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే వారికే మా మద్దతు: వైయస్ జగన్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రెండు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. ప్రముఖ జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. ప్రజల అభీష్టం మేరకు కాకుండా ఇష్టానికి రాష్ట్రం విభజించిన కాంగ్రెస్... ఆ తర్వాత అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీని నెరవేర్చని బీజేపీలు రెండు రాష్ట్రానికి అన్యాయం చేశాయని అన్నారు.
పాదయాత్రతో ప్రజల ఇబ్బందులు తెలుసుకోగలిగాను
పాదయాత్ర చేయడం వల్లే రాష్ట్రంలోని చాలామంది ప్రజల ఇబ్బందులు తెలుసుకోగలిగానని చెప్పిన జగన్... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్లు పెట్టి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే తన ధ్యేయం అన్న వైయస్ జగన్... తాను చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయన్నారు. తాను మరణించిన తర్వాత కూడా ప్రజల మనసుల్లో తాను బతికి ఉండాలంటే సుపరిపాలన అందించాలని చెప్పారు. ఇక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను విభజించిన తర్వాత ఉత్పన్నమైన సమస్యలు కొందరు వ్యక్తుల వల్లే వచ్చాయని జగన్ అన్నారు. రైతు రుణమాఫీలు పూర్తి స్థాయిలో చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా 2014లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ రైతు సమస్యలను, రుణమాఫీలను గాలికొదిలేసిందన్నారు. అంతకుముందు వచ్చే వడ్డీలేని రుణాలు కూడా ఇప్పుడు రైతులకు రావడంలేదని రైతు దుస్థితిపై జగన్ మాట్లాడారు.
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ బీజేపీలు రెండూ మోసం చేశాయి
చంద్రబాబు పాలనలో ఏదైనా సంక్షేమ పథకాలు పొందాలంటే అర్హుడైన వ్యక్తి టీడీపీకి ఓటువేశాడా లేదా అని అడుగుతున్నారని ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదన్నారు జగన్. ఓ వర్గంవారికి మాత్రమే మేలు చేకూరేలా చంద్రబాబు ప్రభత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే ప్రతిగ్రామంలో ఒక సెక్రటేరియట్ను తీసుకొస్తామని జగన్ చెప్పారు. అంతేకాదు తాము ప్రకటించిన నవరత్నాలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని జగన్ స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై మాట్లాడిన జగన్... పార్లమెంటు తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని విభజించారని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ హామీని నెరవేర్చలేదని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే చాలా వెసులుబాటులు వస్తాయి కాబట్టి పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తాయని తద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం డిగ్రీపట్టా పట్టుకున్న యువత ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఏపీలో నెలకొన్నాయన్నారు. ఇక గతంలో ఎన్నో రాష్ట్రాలను విభజించి వాటికి ఇచ్చిన ప్రత్యేక హోదా ఏపీని విభజించినప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని జగన్ ప్రశ్నించారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక హోదా ఇవ్వగా లేనిది పార్లమెంటు సాక్షిగా ఏపీకి హోదా ఇస్తామని ఇవ్వకపోవడమంటే ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని జగన్ అన్నారు. పార్లమెంటు మీద నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోక తప్పదని జగన్ చెప్పారు.
ఎవరు హోదా ఇస్తే వారికి తమ మద్దతు ఉంటుంది
మోడీ, రాహుల్ వీరిద్దరిలో ఎవరిని శత్రువులుగా చూస్తారన్న ప్రశ్నకు జగన్ తెలివిగా సమాధానం చెప్పారు. ఇద్దరూ దొందూ దొందే అని అన్నారు. ఇప్పటికీ ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని అది కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీనా అనేది తమకు అనవసరమన్నారు. నాడు కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు జగన్. ఏపీ ప్రజలను రెండు జాతీయ పార్టీలు వెన్నుపోటు పొడిచాయని చెప్పారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా కేసులెక్కడ..?
ఇక రాజధాని ఫలాన ప్రాంతంలో వస్తుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు అక్కడి రైతుల నుంచి తన బినామీలతో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయించి ముఖ్యమంత్రి పదవిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు జగన్. తన స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజలప్రయోజనాలను ఫనంగా పెట్టబోనని సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆ పదవికి ఉన్న అర్థాన్ని, ప్రాముఖ్యతను చంద్రబాబు మార్చేసారని వెల్లడించారు. ఇక తనపై వచ్చిన కేసుల గురించి మాట్లాడిన జగన్... అవి రాజకీయంగా పెట్టిన కేసులే అని కొట్టి పారేశారు. తాను కాంగ్రెస్తో ఉన్నంతవరకూ తనపై కేసుల్లేవని, కాంగ్రెస్ను వీడి బయటకువచ్చాక టీడీపీ కాంగ్రెస్వారే తనపై కేసులు పెట్టారని చెప్పారు. తన పిటిషనర్లు కూడా కాంగ్రెస్ టీడీపీకి చెందిన వారే అని జగన్ అన్నారు. తన తండ్రి ఉన్న సమయంలో కనీసం హైదరాబాదులో కూడా తను లేనని చెప్పిన జగన్ ... ఓటుకు నోటులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పటికీ ఆయనపై ఎలాంటి కేసులు లేవని దీన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు.
చంద్రబాబు అవినీతిపై నాడు టీడీపీ పుస్తకం విడుదల చేసింది
ఇక కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై మాట్లాడిన వైసీపీ అధినేత... గతేడాది జూన్లో కాంగ్రెస్ చంద్రబాబు అవినీతిపై ఓ పుస్తకాన్నే విడుదల చేసిందని... అలాంటిది టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్తో కలిసి వెళుతోందని ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవని అన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఏదైనా కలిసి వస్తుందని తెలిస్తే ఎంతకైనా దిగజారిపోతారని విమర్శించారు జగన్. నాడు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భవించిందని ఇప్పుడు అదే కాంగ్రెస్తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. అదితెలంగాణ అసెంబ్లీ ఫలితాలతో స్పష్టమైందన్నారు. ఇక కాంగ్రెస్లో ఏపీ ఎప్పుడో మాయమైందని చెప్పారు.