రూ. వేల కోట్ల హవాలా స్కాం గుట్టురట్టు
ముంబై: దక్షిణ ముంబైలోని నాలుగు జాతీయ బ్యాంకులు, ఓ ప్రయివేట్ బ్యాంకు అధికారుల సహకారంతో ఓ భారీ హవాలా స్కాం జరిగిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అంటున్నారు.
హవాలా స్కాం ను డీఆర్ఐ అధికారులు గుట్టురట్టు చేశారు. ఈ హవాలా స్కాం దాదాపు రూ. రెండువేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. 2015 అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు దక్షిణ ముంబైలోని ఆయా బ్యాంకు శాఖల్లో జరిగిందని అధికారులు అన్నారు.
సామాన్యుల పత్రాలు దొంగలించి భారీ మొత్తంలో దేశం నుంచి విదేశాలకు నగదు పంపేశారని అధికారులు గుర్తించారు. అనేక స్కాంలు జరిగినట్లే ఇక్కడ కూడా ఇందులో పేర్లు ఉన్నవాళ్లకు దీంతో ఎలాంటి సంబంధం లేదని, అది ఎలా జరిగింది అనే విషయం వారికి తెలియదని అధికారులు అన్నారు.
ఓ సినిమా హాల్లో పని చేసే కార్మికుడి పేరుతో ఖాతా తెరిచి దాన్నుంచి విదేశాల్లోని వేరే ఖాతాకు రూ. 400 కోట్లు పంపారని వెలుగు చూసింది. ఘట్కోవర్ లో పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి, గొవాండి రైల్వే స్టేషన్ లో పని చేసే టిక్కెట్ కలెక్టర్, స్వీపర్ పేర్లతో ఖాతాలు తెరచి రూ. 400 నుంచి రూ. 600 కోట్లు విదేశీ ఖాతాలకు పంపించారు.
బోగస్ కంపెనీల పేర్లతో ఖాతాలు తెరచి లావాదేవీలు పూర్తికాగానే వాటిని మూసేస్తున్నారని, నల్లధనాన్ని పన్నుల భారం నుంచి తప్పించి విదేశాలకు పంపించడమే వీరి అసలు ఉద్దేశమని డీఆర్ఐ అధికారులు అంటున్నారు.
ఈ స్కాం మొత్తం ఓ కంపెనీ పేరు మీదనే జరిగిందని, దాని అడ్రస్ మస్టిడ్ బందర్ ప్రాంతంలో ఉందని చూపిస్తున్నారని వివరించారు. ప్రథమిక విచారణలో ఈ స్కాం విలువ రూ. 2,232 కోట్లుగా తేలింది.
ఆగ్నేయాసియా దేశాల నుంచి ఎలక్రానిక్ వస్తువులు దిగుమతి చేయించుకోవడానికి ఈ డబ్బు పంపినట్లు రికార్డులు చూపిస్తున్నారని, అయితే ఆ ఎలక్రానిక్ వస్తువుల విలువ కేవలం రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు అన్నారు.
బంగారం, వజ్రాలు అక్రమంగా స్మగ్లింగ్ చేసుకుని, దానికి సంబంధించిన మొత్తాలను గల్ఫ్, ఆగ్నేసియా దేశాలకు హవాలా ద్వారా పంపిస్తున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ హవాలా స్కాం పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.