నిజమేనా ఎంపీ గారూ : ఆ నదిలో నీరు తాగితే సిజేరియన్ అవసరం ఉండదా..!
గర్భిణీలు బిడ్డకు జన్మనివ్వాలంటే సాధారణ ప్రసవంనే కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంటే తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తారు. ఇలా ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముహూర్త బలం చూసి మరీ సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నారు. అంతేకాదు హాస్పిటల్లు కూడా సిజేరియన్ పద్ధతినే ఎక్కువగా అవలంబిస్తున్నాయి. సిజేరియన్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు కూడా కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కానీ సాధారణ ప్రసవం జరగాలంటే ఓ నదిలోని నీళ్లు తాగితే సరిపోతుందని లోక్సభలో ఓ ఎంపీ సెలవిచ్చారు. ఆ నది నీరు తాగితే సిజేరియన్ అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు...? ఆ నీళ్లతో ఇంకేం అద్భుతాలు జరుగుతాయి..?
గరుడ గంగా నదిలోని నీరుకు మహత్యం ఉందట
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ అజయ్ భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎక్కడో కాదు ఏకంగా లోక్సభలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో సిజేరియన్ అవసరం రాకుండా బిడ్డకు జన్మనివ్వాలంటే గరుడ గంగానదిలోని నీళ్లను తాగాలంటూ సలహాఇచ్చారు. ఆ నది ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలోని కుమావ్లో ఉందని తెలిపారు. గరుడగంగా నదికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు చాలా కొద్దిమందికే తెలుసని ఎంపీ తెలిపారు. అంతేకాదు పాముకాటుకు గురైన వారు ఈ గరుడగంగా నదిలో దొరికే రాళ్లతో గాయంపై రుద్దితే ప్రాణాలు కాపాడుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు.
పాము కాటుపై ఈ రాళ్లను రుద్దితే ప్రాణాలు దక్కుతాయట
స్వామి వివేకానంద ధ్యానం చేసిన ఖాదీఘాట్ అనే గ్రామంకు చెందిన వ్యక్తి తనతో ఈ నది యొక్క విశిష్టత గురించి చెప్పినట్లు సభకు తెలిపారు అజయ్ భట్. అతని ఇంట్లోకి ఓ పాము దూరిందని అది ఎలుకల కోసం పెట్టిన బోనులో చిక్కుకుందని చెప్పినట్లు సభలో చెప్పాడు అజయ్ భట్. పామును చూసి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు భయపడినట్టుల చెప్పిన ఆ వ్యక్తి... ఓ సాధువు తనకు ఎదురుపడి గరుడ గంగా నది గురించి చెప్పినట్లు వివరించాడు. గరుడ గంగా నదిలో దొరికే రాళ్లు తీసుకొస్తే పాములు దరిదాపుల్లోకి కూడా రావని ఆ సాధువు చెప్పడంతో ఆ నదిలో దొరికే రాళ్లను ఆ వ్యక్తి తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇక ఆ రాళ్లను చూసిన పాము వెంటనే ఇంట్లో నుంచి పాకుకుంటూ బయటకు వెళ్లిపోయిందని అంతటి మహత్యం ఆ రాళ్లకు ఉందని సభలో చెప్పాడు.
గ్లాసు నీళ్లల్లో రాళ్ల పొడి కలిపి తాగితే సిజేరియన్కు దూరం
ఇక గరుడగంగా నదిలో నీళ్లకు ఎన్నో ఔషధ గుణాలున్నట్లు చెప్పిన ఎంపీ... గర్భిణీ స్త్రీలు ఈ నదిలో దొరికే రాళ్లను కరిగించి ఓ గ్లాసు నీళ్లలో కలిపి తీసుకుంటే సాధారణ ప్రసవం జరుగుతుందని చెప్పారు. సిజేరియన్ అవసరం ఉండదని సభలో తెలిపారు. హోమియోపతికి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ అజయ్ భట్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తన వాదనను చాలామంది అల్లోపతి డాక్టర్లు కొట్టి పారేశారు. నదిలో నీళ్లు తాగితే సిజేరియన్ లేకుండా సాధారణ ప్రసవం జరగడం అసంభవమని... బిడ్డ తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.