నల్లా కనెక్షన్ కోసం : గతంలో వేలం వేసుకున్నారు.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు..
ఆగ్రా : వేసవిలో నీటి కష్టాలు సాధారణమే. కానీ ఆ గ్రామంలో మాత్రం కాలంతో నిమిత్తంలేకుండా ఎప్పుడూ నీటికి కటకటే. ఎన్నిసార్లు అధికారులను కలిసినా, వినతిపత్రాలు అందజేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన గ్రామంలోని ఓ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీస సౌకర్యాలు లేని అనుభవిస్తున్న కష్టాలు ఏకరువు పెడుతూ ప్రధానికి లేఖ రాసింది. మాకు నీళ్లివ్వండి లేదా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండంటూ కోరింది.
వాటర్ వార్: చెన్నైలో నీటి ఎద్దడి తీవ్రతరం...నీళ్లకోసం గొడవల్లో ఒకరు మృతి
మంచినీటి కోసం ఆగచాట్లు
యూపీ ఆగ్రాకు సమీపంలోని హత్రాస్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన చంద్రపాల్ సింగ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. పుట్టి బుద్ది ఎరిగినప్పటి నుంచి తమ గ్రామంలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు కల్పించాలంటూ ఎన్నిసార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా.. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. దీంతో గతంలో వాటర్ కనెక్షన్ కోసం చంద్రపాల్ సహా మరికొందరు యువకులు తమను తాము వేలం వేసుకుంటున్నట్లు ప్రకటించి నిరసన తెలిపారు. విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో అధికారులు సర్దిచెప్పడంతో వెనక్కితగ్గారు.
ఆత్మహత్యకు అనుతివ్వమని లేఖ
దశాబ్దాలు గడిచినా నీళ్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో చంద్రపాల్ ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరించడంతో పాటు తమ గ్రామానికి నీళ్లైనా ఇవ్వండి లేదా తామంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్ అయినా ఇవ్వండంటూ విజ్ఞప్తి చేశారు. లేఖతో పాటు చంద్రపాల్ కూతురు తమ నీటి కష్టాల గురించి ప్రధానికి వివరిస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆ అమ్మాయి ఉప్పు నీటిని తాగి నిత్యం నరకం అనుభవించేకన్నా ఒకేసారి చనిపోయేందుకు అనుమతివ్వమని మోడీని కోరింది.
150 గ్రామాల్లో నీటి కటకట
హత్రాస్ డివిజన్ పరిధిలోని 150 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మంచినీటి సౌకర్యం లేక జనం దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికీ వినతిపత్రం అందజేసినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. తాజాగా ఆత్మహత్యకు పర్మిషన్ అడుగుతూ ప్రధానికి లేఖ రాయడంపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ను సంప్రదించగా.. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.