Drug Mafia: సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ల సంబరాలు, మంత్రి అల్లుడికి మడతఖాజా, బ్రిటీషోడి దెబ్బ!
ముంబాయి/ హైదరాబాద్/బెంగళూరు: ముంబాయి డ్రగ్స్ కేసులో NCB అధికారులు మరోసారి పంజా విసిరారు. అధికారంలో ఉన్న మంత్రి అల్లుడికి మడతఖాజా తినిపించిన ఎన్ సీబీ అధికారులు సంక్రాంతి పండుగ రోజు అధికార పార్టీ నాయకులకు చుక్కలు చూపించారు. మంత్రిగారి అల్లుడు ఆన్ లైన్ లో రూ. 20 వేలకు డ్రగ్స్ కొనుగోలు చేశాడని ఇటీవల అరెస్టు అయిన బ్రిటీష్ జాతీయుడు ఎన్ సీబీ అధికారులకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఎన్ సీబీ అధికారులు రంగంలోకి దిగారు.
సంక్రాంతి అల్లుడు
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్ సీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్ సీపీకి చెందిన సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఆ పార్టీలో చక్రం తిప్పుతున్న ప్రముఖ నేతల్లో ఒకరు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో నవాబ్ మాలిక్ మంత్రిగా పని చేస్తున్నారు. నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ నేడు ఎన్ సీబీ అధికారులకు సంక్రాంతి అల్లుడు అయ్యాడు.
కొంప ముంచిన బ్రిటీషోడు
గత మంగళవారం ముంబాయి డ్రగ్స్ కేసులో బ్రిటీష్ జాతీయుడితో పాటు ఇద్దరిని ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. బ్రిటీషోడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ బుక్కైపోయాడు. ఆన్ లైన్ లో సమీర్ ఖాన్ రూ. 20, 000 విలువైన డ్రగ్స్ కొనుగోలు చేశాడని బ్రిటీషోడు ఎన్ సీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
సంక్రాంతి రోజు షాక్
గురువారం ఉదయం 11 గంటల సమయంలో సమీర్ ఖాన్ అతని కార్యాలయానికి వెళ్లాడు. అప్పటికే సమీర్ కార్యాలయం సమీపంలో ఎన్ సీబీ అధికారులు మకాం వేశారు. సమీర్ ఖాన్ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్ సీబీ అధికారులు కొన్ని గంటల పాటు ఆయన్ను విచారణ చేశారు. అనంతరం ముంబాయిలో బల్లార్డ్ ఎస్టేట్ లోని ఎన్ సీబీ కార్యాలయానికి సమీర్ ఖాన్ ను పిలుచుకుని వెళ్లి విచారణ చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరు అందర్
ఇప్పటికే ముంబాయిలో ప్రసిద్ది చెందిన ముజాద్ హన్వాలా దుకాణాల యజమానుల్లో ఒక్కరైన రామ్ కుమార్ తివారిని ఎన్ సీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. గత వారంలో కరణ్ సజ్నాని అనే వ్యక్తిని ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. ముంబాయి డ్రగ్స్ మాఫియా కేసులో ఎన్ సీబీ అధికారులు ఒక్కొక్కరిని అరెస్టు చేసి చిత్రాన్నాం తినిపించడంతో మిగిలిన నిందితులు హడలిపోతున్నారు.