ఎయిరిండియా విమానంలో 'డ్రగ్స్'.. 2కేజీల మార్ఫిన్!: తీసుకొచ్చిందెవరు?..
చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలలో 2కేజీల డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ: హైదరాబాద్ 'డ్రగ్స్' రాకెట్పై కీలక విచారణ జరుగుతుండగానే ఎయిరిండియా విమానంలో మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలలో 2కేజీల డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విమానం చెన్నై నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా విమానాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫుడ్ ట్రాలీలో ఎవరికి కనిపించకుండా ఈ డ్రగ్ ప్యాకెట్స్ను దాచిపెట్టినట్లు గుర్తించారు. అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం ఇచ్చారు.
ప్యాకెట్ ను పరిశీలించిన పోలీసులు.. దాన్ని మార్ఫిన్ మిక్స్చర్ గా ధ్రువీకరించారు. ప్యాకెట్ లలో 2కేజీల వరకు దాన్ని దాచినట్లు గుర్తించారు. అయితే ప్యాకెట్ ఎవరు దాచిపెట్టి ఉంటారన్న దానిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సంస్థకు చెందినవారే ఈ డ్రగ్స్ దాచి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.