పాక్ నుండి భారత్ కు 500 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ ... పట్టుబడిన 9మంది ఇరానీలు
మానవాళి మనుగడ కి విఘాతం కలిగించే మాదకద్రవ్యాల మహమ్మారి భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది భారత్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోంది. అంతర్జాతీయ ముఠాలు భారత దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను విక్రయిస్తూ అంతర్జాతీయ ముఠా సభ్యులు పట్టుబడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేయాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత .. నలుగురి ముఠా అరెస్ట్ , కోటి విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
భారత్ లో ఎంతగా నిఘా పెట్టినా మత్తు పదార్ధాల అక్రమ రవాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఈ నగరం, ఆ నగరం అని లేకుండా ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ కామన్ అయిపోయాయి. ఈ క్రమంలో సముద్ర తీరంలో భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ముఠాకు చెక్ పెట్టారు. రూ. 500 కోట్ల విలువైన వంద కిలోల హెరాయిన్ ను బోట్ లో తరలిస్తున్నారన్న పక్కా సమాచారం తో ఆ బోట్ ను వెంటాడి పట్టుకున్నారు. స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేసినా సినీ ఫక్కీలో చేజ్ చేశారు . ఇక వారి వద్ద నుండి 100 కిలోల హెరాయిన్ , 500 కోట్ల ఖరీదైన భారీ డ్రగ్స్ దంప స్వాధీనం చేసుకున్నారు . భారీగా హెరాయిన్ ను తరలిస్తున్న బోటుపై దాడి చేసిన నావికా దళ సిబ్బంది ఇరాన్ దేశానికి చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సాక్షాత్తు పిఎం స్వంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోటుపై దాడి చేసిన అనంతరం కోస్ట్ గార్డ్ అధికారులు బోటుతో పాటు మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. వందల కేజీల హెరాయిన్ ను భారత్ లోకి అక్రమంగా తరలించేందుకు ఇరాన్ జాతీయులు ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్న నావికా దళ అధికారులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. మొత్తానికి 500 కోట్ల విలువ చేసే హెరాయిన్ అత్యంత భారీ డంప్ ను అధికారులు ధ్వంసం చేశారు. అయితే పట్టు బడిన ఇరానీ దేశస్తులు ఒక పాకిస్తానీ తమకు ఈ పని అప్పగించారని చెప్పారు. దీంతో పాకిస్తాన్ నుండి జల మార్గాన డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.