యువకుడిని కాటేసిన పాము.. మద్యం మత్తులో ఉన్న అతను ఏం చేశాడంటే..
అస్రోలీ : పాములు మనుషులను కరవడం కామన్. అయితే మనిషి పామును కరవడం గురించి వింత ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. తనను కరిచిన పామును పట్టుకున్న వ్యక్తి దానిపై కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఆ సర్పాన్ని పళ్లతో కొరికి ముక్కులు చేశాడు. చివరకు హాస్పిటల్లో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు.
అస్రౌలీ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఆదివారం పీకల దాకా మద్యం తాగాడు. తాగిన మత్తులో ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఇంతలో ఇంట్లోకి జొరబడ్డ ఓ పాటు అతన్ని కాటు వేసింది. అంతే కోపంతో ఊగిపోయిన రాజ్ కుమార్ తనను కరిచిన పామును పట్టుకున్నాడు. నోటితో కొరికి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. పాము కాటు వేయడం దాన్ని కొరకడంతో విష ప్రభావానికి గురై అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు.
రాజ్కుమార్ను పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. అక్కడ ప్రస్తుతం అతనికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కూలీ చేసుకునే తమకు రాజ్కుమార్ వైద్యానికి అవసరమైన డబ్బు తమవద్ద లేదని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాజ్ కుమార్ కొరికేసిన పామును కుటుంబసభ్యులు పూడ్చిపెట్టారు. మనిషి పామును కరిచిన విషయం తెలియడంతో స్థానికులు ఆ విషయంపైనే చర్చించుకుంటున్నారు.