ఎయిర్ ఇండియా విమానంలో తాగుబోతు వీరంగం, మహిళ మీద మూత్రం !
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో పీకలదాక మద్యం సేవించిన తాగుబోతు సాటి ప్రయాణికురాలిపట్ల దారుణంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ప్యాంట్ విప్పి పక్కన ఉన్న ప్రయాణికురాలి సీటు మీద మూత్రం పోశాడు. అయినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంపై ప్రయాణికురాలి కుమార్తె ఇంద్రాణి ఘోష్ ఎయిర్ ఇండియా సిబ్బందిని సోషల్ మీడియాలో నిలదీశారు. గురువారం న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రం నుంచి ఢిల్లీ బయలుదేరిన AI102 అంతర్జాతీయ విమానంలో తన తల్లి ప్రయాణించారు.
విమానంలో ఓ తాగుబోతు ప్యాంట్ విప్పి తన తల్లి కుర్చున్న సీటు మీద మూత్రం పోశాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న తన తల్లి షాక్ కు గురైనారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీల్ చేర్ లో కుర్చుని ఉన్న తన తల్లి ఆ తాగుబోతు విమానాశ్రయం బయటకు దర్జాగా వెళ్లిపోయిన విషయం గుర్తించారు.
ఇంత జరిగినా మీరు ఎందుకు ఆ తాగుబోతు మీద చర్యలు తీసుకోలేదు అని మహిళా ప్రయాణికురాలు కుమార్తె ఇద్రాణి ఘోష్ ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీశారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చెయ్యడానికి కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే వెబ్ సైట్ లో ఫీడ్ బ్యాక్ రాయాలంటూ మెసేజ్ వచ్చిందని ఇంద్రాణి ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయం కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి వెళ్లడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మీ తల్లిగారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం, వెంటనే ఆ ప్రయాణికుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇంద్రాణికి ట్వీట్ చేశారు.