లంచాల్లో తేడా: పీకలదాక తాగి సీనియర్ అధికారి మీద సాటి పోలీసుల దాడి, వైరల్!
బెంగళూరు: లంచాలు (మామూళ్లు) పంచుకునే విషయంలో తేడా రావడంతో సర్దిచెప్పడానికి వెళ్లిన సాటి పోలీసు అధికారి మీద, హోటల్ సిబ్బంది మీద మద్యం మత్తులో ఉన్న పోలీసులు దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలోని మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
గత మంగళవారం నుంచి మామూళ్లు పంచుకునే విషయంలో హుళిమావు పోలీసుల మద్య తేడా వస్తోందని సమాచారం. వారం రోజులుగా జరుగుతున్న ఈ మామూళ్ల పంపకాల పంచాయితీని పరిష్కరించకోవాలని మంగళవారం రాత్రి హుళిమావు పోలీసులు నిర్ణయించారు. పీకలదాకా మద్యం సేవించిన పోలీసులు బన్నేరుఘట్ట రోడ్డులోని ఎంఫైర్ హోటల్ కు వెళ్లారు.
మద్యం మత్తులో ఉన్న పోలీసుల మధ్య మళ్లీ మామూళ్లు పంచుకునే విషయంలో వాదన జరిగింది. అంతే పోలీసులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. గొడవ వద్దని హోటల్ సిబ్బంది, భోజనం చెయ్యడానికి వెళ్లిన కస్టమర్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న పోలీసులు హోటల్ సిబ్బంది, స్థానికుల మీద దాడి చేశారు. విసిగిపోయిన హోటల్ సిబ్బంది మైకోలేఔట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైకోలేఔట్ పోలీసులు, ఏఎస్ఐ హోటల్ దగ్గరకు వెళ్లారు.
మద్యం మత్తులో ఉన్న సాటి పోలీసులకు నచ్చచెప్పడానికి ఏఎస్ఐ, మైకోలేఔట్ పోలీసులు ప్రయత్నించారు. అంతే మద్యం మత్తులో ఉన్న హుళిమావు పోలీసులు మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదడంతో ఆయన తల, ముఖం మీద తీవ్రగాయాలు అయ్యాయి.
పరువు పోతుందని గుర్తించిన పోలీసు అధికారులు కేసు మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే మద్యం మత్తులో పోలీసులు దాడులు చేసుకోవడం, ఏఎస్ఐని చితకబాదడం ఎంఫైర్ హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.