మద్యం మత్తులో తుపాకితో కొడుకు మీద కాల్పులు జరిపిన తండ్రి, ఏం జరిగిందో తెలీదు !
బెంగళూరు: పీకలదాక మద్యం సేవించిన తండ్రి కుమారుడిని తుపాకితో కాల్చిన ఘటన కర్ణాటకలోన ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. శిరిసిలో నివాసం ఉంటున్న నాగేష్ అనే యువకుడు తుపాకి తూటాలకు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శిరిసిలోని నెరబైలు ప్రాంతంలో దేవయ్య, ఆయన కుమారుడు నాగేష్ నివాసం ఉంటున్నారు. దేవయ్య మద్యంకు బానిస అయ్యాడు. బుధవారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన దేవయ్య ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న దేవయ్య ఇంటిలో నానా హంగామా చేశాడు.
మద్యం సేవించి వచ్చావని, భోజనం చేసి నిద్రపోవాలని నాగేష్ తండ్రికి చెప్పాడు. ఆ సమయంలో తనతోనే గొడవ పడుతావా అంటూ దేవయ్య రెచ్చపోయాడు. పీకలదాక మద్యం మత్తులో ఉన్న దేవయ్య ఇంటిలోనే కుమారుడు నాగేష్ తో గొడవ పెట్టుకున్నాడు.
మాటామాటా పెడగడంతో ఇంటిలో ఉన్న తుపాకి తీసుకున్న దేవయ్య కుమారుడు నాగేష్ మీద కాల్పులు జరిపాడు. తుపాకి తూటాలు దూసుకుపోవడంతో నాగేష్ కుప్పకూలిపోయాడు. కుమారుడు నాగేష్ మీద కాల్పులు జరిపిన దేవయ్యకు అక్కడ జరిగిన తతంగం ఏమీ గుర్తుకు లేదు.
రక్తపుమడుగులో కుప్పకూలిన నాగేష్ పక్కనే అతని తండ్రి దేవయ్య నిద్రపోయాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు తీవ్రగాయలైన నాగేష్ ను వెంటనే హుబ్బళిలోని టీఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. మత్తు దిగిన దేవయ్యను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నాగేష్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.