వలస కూలీలకు కేంద్రం డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు..! మాయం చేసి బేరసారాలకు దిగిన దళారీలు..!!
గాంధీ నగర్/హైదరాబాద్ : వలస కూలీలకు కష్టాలు వరసకడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిన వారి జీవనం మరింత దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. జీవనోపాది కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులను కరోనా వైరస్ ఘోరంగా పగబట్టినట్టు తెలుస్తోంది. దేశంలోని సుధూర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను పొందలేక, ఉపాది లేక జీవన్మరణ సమస్యను వలస కూలీలు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.
తెలుగు మత్స్యకారులకు డ్రై ఫ్రూట్స్ పాకెట్లు.. బేరసారాలతో ఎంటరైన దళారీలు..
గుజరాత్ రాష్ట్రంలో ఇరుక్కు పోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కూలీలను స్వస్థాలకు తరలించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయి. అందులో భాగంగా వలస కార్మికులను ప్రత్యేక వాహనాల్లో గుజరాత్ నుండి తెలుగు రాష్ట్రాలకు పంపించేందుకు మార్గం సుగమం చేసారు ప్రభుత్వ పెద్దలు. కాగా రెండు మూడు రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మార్గం మధ్యలో ఆకలి తీర్చుకోవడానికి కూలీలకు కేంద్ర ప్రభుత్వం డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లను అందించేందుకు రంగం సిద్దం చేసింది. ఐతే డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లను మాయం చేసిన దళారీలు వాటిని వలసకూలీలకే తిరిగి అమ్మేందుకు బేరాసారాలకు దిగడం పలు విమర్శలకు తావిస్తోంది.
వలస కూలీల కష్టాలు అన్నిఇన్నీ కావు.. ఏపి, గుజరాత్ ప్రభుత్వాల చొరవతో బయటపడ్డ కూలీలు..
కూలీల కష్ట కాలంలోకూడా దళారుల వికృత చేష్టలేంటని కూలీలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం ఒకవైపు, లాక్ డౌన్ ఆంక్షలు మరొకవైపు కలిసి దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చెప్ప తరం కాకుండా పరిణమించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా గుజరాత్ తీరంలో చిక్కుకుపోయారు. ఈ రకంగా చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను విడిపించేందుకు, తిరిగి వారిని ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు వైసీపి ప్రభుత్వంతో పాటు గుజరాత్, ఇటు కేంద్ర హోంశాఖతోను సంప్రదింపులు జరిపి ప్రత్యేక వాహనాలలో వారిని తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
అదను చూసి దందాకు దిగిన దళారులు.. రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు..
సరిగ్గా ఇక్కడే వలస కూలీలకు విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్న వలస కార్మికుల కోసం ఒక్కొక్కరికి సుమారు మూడు వేల రూపాయల విలువ చేసే డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. అయితే దళారులు వీటిని మాయం చేసారు. ఒక్కొక్క తెలుగు మత్స్యకారుల నుంచి 3 వేల రూపాయలు వసూలు చేసేలా, డ్రై ఫ్రూట్స్ పాకెట్లతో బేరసారాలు మొదలుపెట్టారు. మూడువేల రూపాయలు ఇస్తే గాని డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఇవ్వలేమని దళారులు బేరం పెట్టారు. దాదాపు రెండు, మూడు రోజుల ప్రయాణంలో మార్గమధ్యంలో తినేందుకు ఏమీ దొరకవని, ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఏకైక దిక్కని వలస కార్మికులకు వాటిని విక్రయించేందుకు ప్రయత్నించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
డ్రై ఫ్రూట్స్ దందాకు దిగింది తెలుగువాడే.. అవాక్కయిన గుజరాత్ పోలీసులు..
డబ్బులున్న మత్స్యకారులు వాటిని కొనుగోలు చేయగా మిగిలిన వారు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొందరు తెలుగు జాలర్లు చొరవ చూపి దళారుల దందాను గుజరాత్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు దళారుల కింగ్ పిన్ని అదుపులోకి తీసుకున్నారు. జాలర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని గుర్తించారు. అయితే అతను కూడా తెలుగువాడే కావడం అధికారులను విస్మయానికి గురి చేసింది. 60 మంది వద్ద మనిషికి 3 వేల రూపాయలు వసూలు చేసిన నారాయణ రావు కూడా మత్స్యకారుల్లో ఒకడని గుర్తించారు. నారాయణ రావును అరెస్ట్ చేసి రాజ్కోట్ జైలుకు తరలించి తగిన గుణపాఠం చెప్పారు పోలీసులు. ఆ తర్వాత ప్రతి బస్సుతో ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ప్రతి వ్యక్తికి మూడు వేలు విలువ చేసే డ్రైఫ్రూట్స్ తో కూడిన ఫుడ్ కిట్ అందజేసారు అధికారులు. మూడు బస్సుల్లో మంగళవారం రాత్రి జాలర్లు రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరారు.