డీఎస్ఫీ ఆత్మహత్య, కర్ణాటక మంత్రి జార్జ్ (ఏ1) నిందితుడు, ఐపీఎస్ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్ !
కర్ణాటక పోలీసు శాఖలో డీఎస్పీగా ఉద్యోగం చేస్తున్న ఎంకే. గణపతి ఆత్మహత్య కేసులో బెంగళూరు నగరాభివృద్ది మంత్రి కేజే. జార్జ్, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బెంగళూరు: కర్ణాటక పోలీసు శాఖలో డీఎస్పీగా ఉద్యోగం చేస్తున్న ఎంకే. గణపతి ఆత్మహత్య కేసులో బెంగళూరు నగరాభివృద్ది మంత్రి కేజే. జార్జ్, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐడీ అధికారులు ఇదే కేసులో గతంలో మంత్రి జార్జ్, ఇద్దరు ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చారు.
కర్ణాటకలోని మడికేరిలోని లాడ్జ్ లో రూమ్ నెంబర్ 315లో డీఎస్పీ గణపతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు డీఎస్పీ గణపతి తన ఆత్మహత్యకు మంత్రి కేజే. జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రణవ్ మహంతి, ఎఎన్. ప్రసాద్ కారణం అంటూ డెత్ నోట్ రాసిపెట్టారు.
డీఎస్పీ గణపతి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ తో పాటు ఓ వీడియో తీసి అందులో కేజే. జార్జ్, ఐపీఎస్ అధికారుల వేధింపుల వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించారు. కర్ణాటక ప్రభుత్వం సీఐడీతో గణపతి ఆత్మహత్య కేసు విచారణ చేయించింది.
సీఐడీ అధికారులు కేసు విచారణ చేసి మంత్రి జార్జ్ తో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చి బీ రిపోర్టు సమర్పించారు. గణపతి తండ్రి కుశాలప్ప, సోదరుడు మాచయ్య, సోదరి బబితా సుప్రీం కోర్టును ఆశ్రయించి కేసు విచారణ సీబీఐతో దర్యాప్తు చేయించాలని మనవి చేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు దర్యాప్తు చేసిన నివేదికను చెన్నైలోని సీబీఐ అధికారులకు అప్పగించారు. గణపతి ఆత్మహత్య వీడియో టేప్ విచారణలో సీఐడీ అధికారులు విఫలం అయ్యారని సీబీఐ విచారణలో వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన సీబీఐ అధికారులు గణపతి ఆత్మహత్య కేసులో మంత్రి కేజే. జార్జ్ (ఏ1), ఐపీఎస్ అధికారులు ప్రణవ్ మోహంతి, ఎఎన్. ప్రసాద్ ను (ఏ2,ఏ3) నిందితులుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.