మోడీకి అంత సీన్ లేదట! ప్రియాంకతో ప్రయోజనం శూన్యమట!
ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈసారి మోడీ ఛరిష్మా పనిచేయదని చెప్పింది. ఫిబ్రవరిలో ఎస్పీ- బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం బీజేపీ పాపులారిటీ తగ్గిందని స్పష్టం చేసింది. మెజార్టీ ఓటర్లు ప్రాంతీయ పార్టీల కూటమికే పట్టం కట్టాలని నిర్ణయించినట్లు సర్వేలో వెల్లడైంది. ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ గంపెడాశ పెట్టుకున్నా.. ఆమె ప్రభావం అంతంతమాత్రమేనని తేలింది.
మోడీ తీసుకొచ్చిన విధానాలు ప్రజలకు ఏమాత్రం మేలుచేయలేదు: ప్రియాంకా గాంధీ
ఎస్పీ, బీఎస్పీకి 44శాతం మద్దతు
ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్కు చెందిన 25 మంది స్టూడెంట్స్ 3నెలల పాటు సర్వే నిర్వహించారు. యూపీలోని 80 లోక్సభ నియోజకవర్గాల్లో 38వేల మందిని ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో 44శాతం మంది ఓటర్లు ఎస్పీ - బీఎస్పీ కూటమికి ఓటేస్తామని చెప్పినట్లు సర్వే వెల్లడించింది. కుల సమీకరణాలు ఆ కూటమికి కలిసొస్తాయని చెప్పింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేస్తున్నందున ముస్లిం, యాదవ, దళిత, జాట్ వర్గానికి చెందిన ఓటర్ల ఓట్లు కూటమికే పడతాయని స్పష్టమైంది.
తగ్గిన మోడీ ఛరిష్మా
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిన మోడీ ఛరిష్మా ఈసారి అంతగా పనిచేయదని డీయూ సర్వేలో తేలింది. 2014 ఎన్నికల తరహా ఫలితాలు ఈసారి సాధించడం మోడీ వల్లకాదని ఓటర్లు తేల్చేశారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ బీజేపీకి కొంత లబ్ది చేకూర్చినా.. ప్రస్తుతం యూపీలో కేవలం 37శాతం మంది మాత్రమే బీజేపీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, నిరుద్యోగిత, రాఫెల్ రచ్చ తదితర అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి.
ప్రియాంక ప్రభావం అంతంత మాత్రం
ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై గంపెడాశ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ యూనివర్సిటీ సర్వే షాకిచ్చింది. తూర్పు యూపీ బాధ్యతలు స్వీకరించి కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నా ఆమె వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని తేల్చింది. ప్రస్తుతం యూపీలో 15శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుండగా.. ప్రియాంక రాకతో ఆ సంఖ్య ఏం పెరగదని సర్వే స్పష్టం చేసింది.