ఇది కేంద్రం రెండు నాల్కల ధోరణి కాదా..??
యూ టర్న్ అనే పదం ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపి రాజకీయాలను ద్రుష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ని ఉద్దేశించి ఈ పదాన్ని విరివిగా వాడుతున్నారు. యూటర్న్ అనే పదానికి డిక్షనరీ ప్రకారం అనుకున్న ప్రణాళికను మార్చుకోవడం, ముఖ్యంగా రాజకీయ ప్రణాళికలను తిరగరాయడం అని అర్థం. నాలుగు సంవత్సరాల క్రితం మోదీకి బ్రహ్మరథం పట్టిన ఆంధ్రా ప్రజానికం, యూటర్న్ మోదీ అనే స్థాయికి వచ్చారు. 'యూ-టర్న్ మోదీ' పరిణామ క్రమాన్ని గమనిస్తే, మొదటగా కనపడేది గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలతో పాటు, బీజేపీ మ్యానిఫెస్టోలో ఆంధ్రకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత అటకెక్కించడం ప్రధానంగా కనిపిస్తాయి.
బీజేపి ప్రభుత్వం పార్లమెంటులో చెప్పేది ఒకటి, సుప్రీం కోర్టుకు నివేదించేది వేరొకటి..
సుప్రీం కోర్టు సాక్షిగా కేంద్రం ఆంద్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం పై రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందనే అంశం స్పష్టమౌతోంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పార్లమెంటు సాక్షిగా అంత మంది ఎం.పి.లు గళమెత్తినప్పటికీ కేంద్రానికి కదలిక లేకపోవడం విచారకరం. పార్లమెంటులో జోన్ అంశం పరిశీలనలో ఉంది అంటూనే మరో పక్క విభజన చట్టం అమలు పై పొంగులేటి సుధాకర్ వేసిన పిటిషన్ కు సమాధానంగా జోన్ కుదరదని, ఆ అవసరం లేదని అఫిడవిట్ దాఖలు చేయటం తో రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ కు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయటం అంతగా ఉపయోగం ఉండదని విభజన హామీలపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అభిప్రాయ పడినట్లు తెలియ జేయటం, ఇప్పటికే విభజనానంతర పరిణామాలతో, ప్రత్యేక హోదా విషయంలో తీవ్రంగా గాయపడిన ప్రజల మనోభావాలపై అగ్గికి ఆజ్యం పోసినట్టైంది.
చట్టంలో లేవన్న పేరుతో విభజన హామీలకు ఎగనామం..
ఆంధ్రప్రదేశ్ పురవిభజన చట్టం ప్రకారం విభజన జరిగిన తేదీ నుండి ఆరు నెలలోపు రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతూ ఉన్నప్పటికీ రకరకాల కమిటీల పేరుతో నాలుగేళ్ళు తాత్సారం చేసి ఇప్పుడు కుదరదని చెప్పటం రాష్ట్ర ప్రజలను మోదీ ప్రభుత్వం మభ్యపెట్టిందనే అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో నాలుగు రైల్వే డివిజన్లు (వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు) ఉన్నప్పటికీ, కొత్త రైళ్ళ మంజూరు, బెర్తుల కేటాయింపు విషయంలో సరైన న్యాయం జరగకపోవడం, అందుకు సరైన పరిష్కారం రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఒక్కటే పరిష్కారం అని రాష్ట్రంలో ఉన్న ప్రయాణీకుల హృదయాలలో ముద్ర పడిపోయింది. విభజన హామీలలో ఒకటైన రైల్వే జోన్ విషయంలో సత్వర నిర్ణయం ప్రకటించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నప్పటికి కేంద్రం మొండి చెయ్యి చూపడం పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పదవ షెడ్యూల్ ని పజిల్ గా మార్చిన బీజేపీ..
10వ షెడ్యుల్ లో పేర్కొన్న సంస్థల విషయంలో వాటి నిర్వహణ, సేవల విషయాలను పేర్కొన్నారే తప్ప ఆస్తుల, నిధుల విషయంలో ప్రస్తావన లేకపోవడంతో పలు సందర్భాలలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ల పై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తులు అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 10వ షెడ్యుల్ లో ఉన్న కేంద్ర సంస్థలన్నీ దాదాపు తెలంగాణ పరిధిలో ఉండటం ఈ సమస్య పరిష్కారానికి ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్ర కమిటీల పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య సయోధ్య కుదరకపోవడం కూడా ఘర్శణ వాతావరణానికి దారితీసింది. విభజన చట్టంలో పేర్కొన్న విజయవాడ, విశాఖ పట్నం మెట్రో ప్రాజెక్ట్ ల విషయంలో కూడా తగినంత జనాభా లేరని పిలిచిన టెండర్ల సైతం రద్దు చేయడం కేంద్ర ఏక పక్ష దోరణికి నిదర్శనంగా నిలుస్తోంది.
బీజేపి పైన ఆశలు ఆవిరి.. వ్యూహరచనలో కాంగ్రెస్..
ఏపీలో విభజనతో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ, విభజనతో దూరమైన నేతలను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తూ, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని సి.డబ్లు.సి.లో తీర్మానం చేసింది. మరో వైపు నాలుగేళ్ళు స్తబ్దుగా ఉండి అప్పుడప్పుడు ప్రశిస్తూ ఉన్న జనసేన సైతం ఒక్క వామ పక్షాలతో తప్ప మరే ఇతర పార్టీలతో జత కట్టే అవకాశం కల్పించడంలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పొత్తులకు ఆస్కారం లేకపోగా, ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో విభజన హామీల అమలు పట్ల రెండు తెలుగు రాష్ట్రాలతో రెండు నాల్కల దోరణి అవలంబిస్తున్న బీజేపి కాకుండా, వచ్చే ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉన్నదన్న విషయంలో ఎలాంటి సంకోచం లేదు..