వీడియోలూ ఉన్నాయి: దుబ్బాక తనిఖీలపై మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి జరిగిన పరిణామాలు మరింత రాజకీయ వేడిని పుట్టించాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సహా ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ల అరెస్టులు కలకలం రేపాయి.
ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో దొరికిన డబ్బులు రఘునందన్ రావుకు చెందినవేనని ఇంటి యజమాని చెప్పారని తెలిపారు. సోదాల సమయంలో తీసిన వీడియోలు ఉన్నాయని, ప్రజల ముందుకు ఆ వీడియోలను తీసుకువస్తామన్నారు.
నిందితులు గోబెల్ ప్రచార చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో డిపాజిటివ్ దక్కదని బీజేపీకి అర్థమైందని హరీశ్ రావు అన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి డిపాజిట్ దక్కలేదని చెప్పారు. బీజేపీలో పనిచేసిన సీనియర్ నాయకులు నేడు బీజేపీకి దూరమయ్యారని, పలువురు సీనియర్ నేతలు కార్యకర్తలతో వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారని హరీశ్ రావు తెలిపారు.
రఘునందన్ రావు ఇళ్లలో సోదాల సందర్భంగా రూ. 18 లక్షల దొరికాయని పోలీసులు చెప్పారు. అయితే, ఆ డబ్బులు పోలీసులే తెచ్చి నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండానే తమ ఇళ్లల్లో సోదాలు చేసి, ఇళ్లంతా చిందరవందర చేశారని రఘునందన్ రావు తెలిపారు. తమ ఇళ్లల్లో ఎలాంటి డబ్బు దొరకలేదని, ఆ డబ్బును పోలీసులే తీసుకొచ్చి.. దొరికాయంటూ అవాస్తవాలు చెబుతున్నారని రఘునందన్ రావు తెలిపారు.
Recommended Video
కాగా, దుబ్బాక నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని బండి సంజయ్ అన్నారు. రఘునందన్ రావును పరామర్శించేందుకు వెళుతుండగా సిద్దిపేటలో పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించడం స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత సంజయ్ ను కరీంనగర్ పంపించారు. దీంతో ఆయన కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకునేవరకు దీక్ష కొనసాగిస్తానని అన్నారు.