ఆన్ లైన్ పోర్టళ్లలో నిత్యావసరాలు కాని వాటికి డిమాండ్ కరవు- వ్యాపారుల గగ్గోలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఆన్ లైన్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాలు కానీ వస్తువుల డిమాండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించింది. కేంద్రం ప్రస్తుతం నిత్యవసరాలకు మాత్రమే అనుమతిస్తుండటమే ఇందుకు కారణం. అయితే తాజాగా కేంద్రం సడలింపులకు మొగ్గు చూపుతుండటంతో దేశవ్యాప్తంగా నాన్ కంటెయిన్ మెంట్ జోన్లలో తిరిగి అమ్మకాలు ప్రారంభించేందుకు ఆన్ లైన్ సంస్ధలు సిద్ధమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా కరోనా .. సరిహద్దుల్లో నో ఎంట్రీ .. నిబంధనలు కఠినతరం
ఆన్ లైన్ నిత్యావసరాలకే...
దేశంలో కరోనా వైరస్ రాకముందు పిల్లల చాక్లెట్ల నుంచీ రిఫ్రిజిరేటర్లు, ఏసీల వరకూ ప్రతీ వస్తువూ ఆన్ లైన్ లో దొరికేది. కానీ లాక్ డౌన్ తర్వాత వైరస్ వ్యాప్తి భయాలతో ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా నిత్యావసరాలు మాత్రమే డెలివరీ చేయాలన్న నిబంధన విధించడంతో వాటి వ్యాపారం అంతా ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటివరకూ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉండే ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గ్యాడ్జెట్స్ ను భారీ సంఖ్యలో అమ్మిన అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్ధలు.. దాదాపు రెండు నెలలుగా కేవలం నిత్యవసరాలు మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్ధితి. అదీ నాన్ కంటైన్ మెంట్ జోన్లలోనే.
సడలింపుల కోసం ఎదురుచూపు..
దేశవ్యాప్తంగా తాజా పరిస్దితిని అంచనా వేసిన కేంద్రం.. రెడ్ జోన్ల బయట ఈ కామర్స్ పోర్టల్స్ ద్వారా అమ్మకాలకు కేంద్రం అనుమతిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కేంద్రం సడలింపుల ఇచ్చినా గతంలో చేసిన వ్యాపారంలో కేవలం 60 నుంచి 70 శాతం మాత్రమే తిరిగి అందుకోగలమని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్ధలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం పలు ఈ కామర్స్ సంస్ధలు భారీ మార్కెట్ కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఇవన్నీ రెడ్ జోన్ లో ఉండటం వారికి నిరాశనే మిగులుస్తోంది. కానీ రెడ్ జోన్లలో ఉద్యోగాల కోత, జీతాల కోత వంటి పరిస్దితులు తమ అమ్మకాలపైనా ప్రభావం చూపుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ-కామర్స్ రంగానికి కష్టాలే...
ఫారెస్టర్ రీసర్చ్ అంచనా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా ఈ- కామర్స్ రంగం 35 శాతం వృద్ధితో 32 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. కానీ తాజాగా 2020లో నెలకొన్న పరిస్దితులతో ఈ వృద్ధి 6 శాతానికే పరిమితం కానుందన్న అంచనాలు ఈ- కామర్స్ వ్యాపార సంస్ధల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి సీజన్ ఈ కామర్స్ మార్కెట్లకు ఎంతో లాభాలను ఆర్జించి పెట్టేది. ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ ల కొనుగోళ్లు ఏటా ఈ సీజన్ లో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్ధితులతో వాటి కొనుగోళ్లు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న చోట కూడా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ఏసీలకు మాత్రమే డిమాండ్ ఉందని ఈ కామర్స్ సంస్ధలు చెబుతున్నాయి. దేశంలో ఈ కామర్స్ రంగంలో రెండో అత్యధిక డిమాండ్ కలిగిన ఫ్యాషన్ రంగం పరిస్దితీ అంతంత మాత్రమే.
ఇక ఆన్ లైన్ లో వాటికే డిమాండ్...
ఫారెస్ట్రర్ రీసెర్చ్ తాజా అంచనాల ప్రకారం ఇక ఏసీలు, ఫ్రిజ్ లకు గతంలో భారీ మార్కెట్ ఉండబోదని తెలుస్తోంది. వీటి స్ధానంలో స్మార్ట్ పరికరాలకు డిమాండ్ పెరగవచ్చని తెలుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరగడం వల్ల స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, హోమ్ అప్లయన్సెస్, దుస్తులు, పిల్లల ఆట బొమ్మలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ జోన్లలో ఉన్న వారు సైతం వీటి కోసమే ఆన్ లైన్లో వెతుకుతున్నట్లు తేలింది. మరోవైపు లాక్ డౌన్ పరిస్ధితుల నేపథ్యంలో కిరణాతో పాటు ఇంట్లో వాడే ఇతర సామాగ్రికి భారీగా డిమాండ్ కనిపిస్తోంది. కొన్నిసార్లు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బయటికి వెళ్లలేని పరిస్ధితుల్లో జనం వీటి కోసం ఎక్కువగా ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నట్లు తెలిసింది. లాక్ డౌన్ లో గ్రోసరీ కోసం ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నట్లు 52 శాతం కస్టమర్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడించారు.