ఆత్మహత్యాసదృశ్యంగా అనిపించింది: విమర్శలపై స్పందించిన డిడి యాంకర్
న్యూఢిల్లీ: ఇటీవల పలు అంశాలను తప్పుగా ప్రస్తావించి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న 24ఏళ్ల దూరదర్శన్ యాంకర్ అయేనా పహుజా ఎట్టకేలకు స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యానం పలు మీడియాల్లో ప్రసారం కావడంతో ఆమెపై సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియాల ద్వారా అనేకమంది విమర్శలు గుప్పించారు.
తనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపాలని ‘ది లాజికల్ ఇండియన్' ఫేస్బుక్ పేజీలో డిడి యాంకర్ అయేనా విజ్ఞప్తి చేశారు. తనపై వెల్లువెత్తిన విమర్శలు రావడం తనకు ఆత్మహత్యా సదృశ్యంగా అనిపించాయని ఆమె వివరించారు.
‘నా జీవితం అంతా వ్యర్థమైంది. నాపై వస్తున్న విమర్శలతో నాలుగు రోజులుగా భోజనం కూడా చేయడం లేదు. తనకు సంబంధించిన ఆ వీడియోను నెట్ నుంచి తీసివేయించేందుకు నా తల్లిదండ్రులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తొలగిస్తున్న తర్వాత మరికొందరు ఆ వీడియోను అప్లోడ్ చేస్తున్నారు.' అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకర్ అయేనా చెప్పారు.
‘రెండు గంటల నా కవరేజీలో నా తప్పును మాత్రమే పోస్ట్ చేశారు. నా కాలేజీ రోజుల నుంచే నేను కార్పొరేట్, ఎంటర్టెయిన్మెంట్ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా పని చేశా' అని చెప్పారు. ‘మేము ప్రత్యక్షప్రసారం చేసే ఐదు నిమిషాల ముందు మైకు పని చేయలేదు. నేను దాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించా. కానీ, అది బాధ్యతారాహిత్యం అనిపించుకుంటుందని నిర్వహించా. అప్పటికే నేను చాలా నర్వస్గా ఉన్నా. ఎవరెవరు అక్కడి వస్తున్నారో చూడలేకపోయా. నా ప్రొడ్యూసర్ కూడా అతిథుల పేర్లను తెలుపలేదు. అయిన నాకు తెలిసిన వారిని పరిచయం చేశా. అడియన్స్ వారిని గుర్తించారునుకుంటా.' అని చెప్పారు.
కాగా, తన కూతురు అయేనాపై వస్తున్న విమర్శలతో ఆమె తల్లి ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘కొందరు తన కూతురు చేసిన తప్పుల వీడియోను మాత్రమే అప్లోడ్ చేశారు. వేలాది మంది ప్రజలు ఆమె(యాంకర్)ను స్టుపిడ్, డంబ్, అని తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శించారు. వీటితో నా కూతురు చాలా బాధించబడింది' అని యాంకర్ తల్లి ‘ది లాజికల్ ఇండియన్'లో పేర్కొంది.
ఇటీవల అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) నవంబర్ 20వ తేదీన గోవాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అయేనా అతిథులను పలకరించారు. అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన వద్ద ఉన్నారని చెబుతూ.. ఆయన తన అభిప్రాయాలను మనతో పంచుకుంటారంటూ నొక్కి వక్కాణించారు.
గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ ఆమె నోటి వెంట ధారాళంగా ప్రవహించింది. దీంతో దూరదర్శన్కు తలనొప్పి వచ్చి పడింది. దానికితోడు మహిళా గవర్నర్ను అతడు అంటూ సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేశారు. అంతేగాక ఓ చైనా నటిని గుర్తించలేకపోయారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, పొరపాటును సరిచేసుకుని నాలుగు నిమిషాల తర్వాత తిరిగి ప్రసారం చేశామని డిడి ఉన్నతాధికారి ఒకరు అన్నారు. జరిగిన తప్పునకు గల కారణాలను తెలుసుకునేందుకు ఎడిజి స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ సంబోధించిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని చెప్పారు. ఆమె సరిగా సిద్ధం కాలేదని చెప్పారు. ఆమెను ఆ కార్యక్రమాన్ని కవర్ చేసే విధుల నుంచి తొలగించామని తెలిపారు. భవిష్యత్ కాంట్రాక్ట్లను కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు.