నిర్భయ దోషులకు నకిలీ ఉరి.. నిజంగా చంపడానికి ముందు ఇదో ప్రక్రియ.. నలుగురినీ వరుసగా నిలబెట్టి..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధమైంది. ఆ నలుగురినీ నిజంగా చంపేయడానికి ముందు చేపట్టే నకిలీ ఉరి ప్రక్రియ సజావుగా సాగినట్లు ఢిల్లీ తీహార్ జైలు అధికారులు తెలిపారు. ముఖేశ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31) ఎంత బరువుంటారో దానికి సమాన బరువుండేలా గోనె సంచుల్లో రాళ్లు రప్పలు నింపి.. మూడో నంబర్ జైలులో ఉరి ట్రయల్స్ నిర్వహించారు.
అందర్నీ ఒకేసారి చంపేస్తారు..
దోషులకు మరణశిక్ష అమలయ్యే సందర్భంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు రావొద్దనే ఉద్దేశంతో ఉరి ట్రయల్స్ నిర్వహించడం సాధారణంగా జరిగేదేనని అధికారులు చెప్పారు. ఒకరితర్వాత ఒకరు కాకుండా.. నలుగురికీ ఒకే సారి ఉరి వేసేలా.. వరుసగా నాలుగు ఉరితాళ్లను సిద్ధం చేసినట్లు వివరించారు. ఆదివారం నిర్వహించిన ఈ ప్రక్రియలో.. జైలు అధికారులు, వివిధ శాఖల బాధ్యులు పాల్గొన్నారు. కాగా, తలారీ లేకుండానే నకిలీ ఉరి ట్రయల్స్ చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషుల్ని ఉరి తీయనున్నారు.
చివరి చూపునకు అనుమతి..
ఢిల్లీ పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాత నిర్భయ దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచారు. ఈ నెల 22న ఉరితీయడానికి కొన్ని నిమిషాల ముందు.. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వారికి అనుమతి లభించింది. ప్రస్తుతం ఆ నలుగురికీ సాధారణ భోజనమే అందిస్తున్నామని, వారి మానసిక పరిస్థితి కూడా సాధారణంగానే ఉందని జైలు అధికారులు తెలిపారు. తమను ఉరితీయబోరనే ధోరణిలోనే వాళ్ల ప్రవర్తన ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు.
‘ఆఖరి అవకాశం‘పై తీవ్ర ఉత్కంఠ
ఉరిశిక్ష పడిన నలుగురు నిర్భయ దోషుల్లో ఇద్దరు దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం(14న) విచారించనుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్.. తమ చాంబర్ లోనే.. రెండు ప్రతిపక్షాల లాయర్లతో అంతర్గతంగా చేపట్టున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. డెత్ వారెంట్ జారీచేస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు అన్యాయం జరిగిందంటూ.. శిక్ష నుంచి తప్పించుకోడానికి ఆఖరి అవకాశంగా.. ముఖేశ్, వినయ్ లు పిటిషన్ వేశారు.
ఆర్గాన్ డొనేషన్కూ నో చెప్పిన కోర్టు..
మరికొద్దిరోజుల్లో చనిపోబోతున్న నిర్భయ నిందితులు.. వారి అవయవాలను దానం చేసే విషయమై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఉరి తీసిన తర్వాత నలుగురి డెడ్ బాడీలను వారి కుటుంబాలకు అందజేస్తారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.