లాలూను వదిలెయ్, మేమున్నాం: నితీష్కు మోడీ ఆఫర్, సంచలన వ్యాఖ్యలు
పాట్నా: భారతీయ జనతా పార్టీ బీహార్ కీలక నేత సుశీల్ కుమార్ మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పశువుల దాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విచారణ ఎదుర్కోనున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవహారంపై ఆయన స్పందించారు. బీహార్ నితీష్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూను వదిలేయాలని ఆయనకు సూచించారు మోడీ.
అంతేగాక, తమ పార్టీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని నడిపించాలని నితీష్కు ఆయన ఆఫర్ ఇచ్చారు. అవినీతి పరుడైన లాలూతో తక్షణమే తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. దాణా కేసులో సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం మోడీ పాట్నాలో మీడియాతో అంశంపై మాట్లాడారు.
'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీష్కు బహిరంగంగా చెబుతున్నా.. తక్షణమే లాలూతో స్నేహాన్ని వదిలేయండి. ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీస్కోండి' అని సుశీల్ మోడీ స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 17ఏళ్లపాటు జేడీయూ-బీజేపీలు మిత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు.
అంతేగాక, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీష్ కీలక భూమిక పోషించారని సుశీల్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్ కుమార్ ఆదేశాల మేరకే లాలూ ప్రసాద్ యాదవ్ తోపాటు ఆర్జేడీకి చెందిన మంత్రుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పేర్కొన్నారు.
'లాలూ ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారో నితీష్కు బాగా తెలుసు. అందుకే లాలూను బలహీనపర్చడం ద్వారా 2019లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సులువుగా పొందొచ్చన్నది నితీష్ ప్రణాళిక' అని మోడీ చెప్పుకొచ్చారు. కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 80, జేడీయూకు 71, బీజేపీకి 58, కాంగ్రెస్ పార్టీకి 27మంది సభ్యులున్నారు. కాగా, సుశీల్ మోడీ వ్యాఖ్యలపై నితీష్ ఏమంటారో వేచిచూడాలి మరి.