కరోనా వ్యాప్తి వేగం తగ్గింది, తెలుగు రాష్ట్రాలు మెరుగ్గానే: కేంద్రం గణాంకాలు ఇలా..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 36 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2546 మంది కోలుకున్నారని, మొత్తం కేసుల్లో ఇది 14.75శాతమని చెప్పారు.

తగ్గుముఖం పట్టిన రెట్టింపు కేసులు..
కరోనా కేసులు రెట్టింపు అవడానికి పడుతున్న వేగం భారతదేశంలో నెమ్మదించిందని, లాక్డౌన్కు ముందు 3.4 రోజులకోసారి కేసులు రెట్టింపు కాగా, ప్రస్తుతం అది 7.5 రోజులకు చేరిందని అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి కేసుల రెట్టింపు వేగం తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. కేరళ, కర్ణాటకలో ఈ రెట్టింపు వేగం బాగా తగ్గిందని తెలిపారు.

మెరుగ్గానే తెలుగు రాష్ట్రాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెట్టింపు రేటు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువ ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో 7.5 రోజులకు రెట్టింపు అవుతుండగా ఏపీలో 10.6 రోజులకు, తెలంగాణలో 9.4 రోజులకు డబుల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు 8.5 రోజులుగా ఉందని, ఒడిశాలో 39.8 రోజులుగా ఉందని తెలిపారు. కేరళలో 72.2 రోజులుగా ఉందని తెలిపారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు మొత్తం 18 రాష్ట్రాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.

గోవా కరోనా ఫ్రీ.. ఈ జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు..
గోవాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు లేవని, ప్రస్తుతం ఆ రాష్ట్రం కరోనావైరస్ ఫ్రీ అయ్యిందని లవ్ అగర్వాల్ తెలిపారు. ఆ రాష్ట్రంలో ఏడుగురు కరోనా బారిన పడగా అందరూ కోలుకున్నారని చెప్పారు. పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడుగు, ఉత్తరాఖండ్లోని పౌడి గడ్వాల్ జిల్లాల్లో గత 28 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాని జిల్లాలో దేశంలో 59 ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 17,656 కరోనా పాజిటివ్ కేసులు, 559 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications