ఐపీఎల్లో క్రికెటర్ల బాడీ షేపుల్లో మార్పులు: కారణమేంటో తెలుసా? శరీర బరువులో: చురుగ్గా కదల్లేక
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్డౌన్ పరిస్థితులు.. క్రికెటర్ల ఫిట్నెస్పై దెబ్బకొట్టాయి. అడుగు తీసి బయట పెట్టలేని స్థితిని క్రికెటర్లు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి ఇదే దుస్థితిను అనుభవించారు. దీని ప్రభావం వల్ల వారి శరీరాకృతిలో మార్పులు కనిపించాయి. లాక్డౌన్ విధించడానికి ముందు జరిగిన మ్యాచుల్లో సిక్స్ ప్యాక్ టైప్లో కనిపించిన క్రికెటర్లు బొద్దుగా మారిపోయారు. బానపొట్టలతో కదులుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో కనిపించిన క్రికెటర్ల షేపులను ప్రేక్షకులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.
జూనియర్ అర్జున రణతుంగలా..
అందరి పరిస్థితీ అలాలేదు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సంజు శాంసన్.. ఇలా కొందరు క్రికెటర్లు దీనికి మినహాయింపు. శుక్రవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ కమ్ చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పట్టిన అద్భుతమైన క్యాచ్..అతని ఫిట్నెస్ లెవెల్ ఏంటో చెప్పకనే చెప్పినట్టయింది. బ్యాటింగ్లో, వికెట్ల మధ్య రన్నింగ్లో పెద్దగా ఇబ్బందులను ఎదుర్కొనలేదు మహీ. ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మ, మనోజ్ తివారీ కూడా అంతే. ఇంతలావు పొట్టేసుకుని.. అర్జున రణతుంగలా కనిపించినప్పటికీ.. క్రీజ్లో మాత్రం తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు.
బద్ధకిస్టులుగా..
ఓ క్రీడాకారుడికి ఫిట్నెస్ ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ఫుట్బాల్, హాకీ, క్రికెట్ వంటి కొన్ని స్పోర్ట్స్ కేటగిరీల్లో ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ ప్రభావం వల్ల పలువురు క్రికెటర్లలో బద్ధకం పెరిగిందనే అంటున్నారు. ప్రాక్టీస్ అందుబాటులో లేకుండాపోయింది. బయట స్వేచ్ఛగా తిరిగే వీలూ రాలేదు. తినడం, తొంగోవడం అనే కాన్సెప్ట్లో వారి దినచర్య సాగి ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా- శరీరాకృతిల్లో మార్పుటు చోటు చేసుకున్నాయి. బద్ధకం సైతం పెరిగిన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
క్వారంటైన్లోనూ రెస్ట్ లేదు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఐపీఎల్ నిర్వాహకులు క్రికెటర్ల కోసం క్వారంటైన్ను ఏర్పాటు చేశారు. ఈ క్వారంటైన్ టైమ్లో కూడా వారికి విశ్రాంతి దొరకలేదట. క్వారంటైన్ టైమ్లో తీరిక లేకుండా గడపాల్సి వచ్చిందని, ఫిట్నెస్ కోసం శ్రమించాల్సి వచ్చిందని కోల్కత నైట్ రైడర్స్ స్కిప్పర్ దినేష్ కార్తీక్ వెల్లడించారు. తమ టీమ్ ఫిట్నెస్ కోచ్, ఒలింపిక్ మాజీ స్ప్రింటర్ క్రిస్ డొనాల్డ్సన్.. తమకు విశ్రాంతి తీసుకోనిచ్చేవాడుకాదని చెప్పారు. లాక్డౌన్ వల్ల ఒక్క క్రికెట్లోనే కాకుండా.. క్రీడా ప్రపంచంలో పలువురిలో బద్ధకం పెరిగిందని కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అభిప్రాయపడ్డారు.
కోచ్కు థ్యాంక్స్ చెప్పిన సంజు
లాక్డౌన్ సమయంలో తాను పెద్దగా ఇబ్బందులకు గురి కాలేదని, ఆ సమయంలో కనీసం 20 వేలకు పైగా బంతులతో ప్రాక్టీస్ కొనసాగించానని సంజు శాంసన్ వెల్లడించాడు. ఐపీఎల్లో స్వేచ్ఛగా షాట్లను ఆడాలంటే ఫిట్నెస్ అవసరమని, తాను దాన్ని విస్మరించలేదని అన్నాడు. ప్రస్తుతం తనకు ఫిట్నెస్ సమస్యలు లేవని చెప్పుకొచ్చాడు. చాలామంది క్రికెటర్లు ట్రెడ్మిల్పై వాకింగ్ చేయడానికి ఇష్టపడరని ఢిల్లీ ఫ్రాంఛైజీ మాజీ ఫిజియో వైభవ్ దాగా చెప్పారు. పవర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్కు కేరాఫ్గా నిలిచే టీ20 మ్యాచ్ల కోసం క్రికెటర్లు తమ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం తప్పదనీ అన్నారు.