బీజేపీని ఆదుకునేందుకు ఇక్కడ దుష్యంత్ చౌతాలా లేరు: సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్రలో పదవుల పంపకాల మధ్య బీజేపీ శివసేనలు కొట్టుమిట్టాడుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి 105 సీట్లు వచ్చి శివసేనకు 56 సీట్లు రావడంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే శివసేన మాత్రం బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చాకే ప్రభుత్వం ఏర్పాటుకు ముందడుగు వేయాలని గట్టిగా పట్టుకుని కూర్చుంది. బీజేపీ కాకపోతే తమకు వేరే మార్గాలున్నాయంటూ కూడా బెదిరింపులకు దిగుతోంది శివసేన పార్టీ. అయితే ఫలితాలు వెలువడి 5 రోజులు అవుతున్నప్పటికీ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హర్యానాలోలా ఇక్కడ దుష్యంత్ చౌతాలా లేరు
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతోందంటే ఇక్కడ దుష్యంత్ చౌతాలా లాంటి నాయకుడు లేరని సెటైర్ వేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందంటే దుష్యంత్ లాంటి నాయకుడుడ వారికి అండగా నిలిచాడని కానీ మహారాష్ట్రలో పరిస్థితి అలా లేదని సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్రలో ధర్మానికి సత్యానికి అనుగుణంగా రాజకీయాలు చేసేది శివసేన పార్టీ అని, శరద్ పవార్ బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని చెప్పిన సంజయ్ రౌత్... బీజేపీతో శరద్ పవార్ కలవరని చెప్పారు. కొద్ది రోజుల క్రితం కూడా రిమోట్ కంట్రోల్ తమ చేతిలో ఉందని సంజయ్ రౌత్ సీరియస్కామెంట్స్ చేశారు.
బీజేపీతో చేతులు కలిపితేనే దుష్యంత్కు డిప్యూటీ సీఎం
హర్యానాలో ఎన్నికల పరిస్థితి గురించి మాట్లాడారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హర్యానాలో ఎన్నికల తర్వాత జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా బీజేపీతో చేతులు కలపడం ద్వారా అతనికి డిప్యూటీ సీఎం పదవిని కమలం పార్టీ ఆఫర్ చేసిందని కానీ మహారాష్ట్రలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇక దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా, తాత ఓపీ చౌతాలాతో కలిసి టీచర్ స్కామ్లో జైలులో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పిన సంజయ్ రౌత్, బీజేపీ జేజేపీ పొత్తు కుదరగానే అజయ్ చౌతాలా పెరోల్పై బయటకు వచ్చారని గుర్తుచేశారు.
సీఎం సీటుపై తేల్చండి...పట్టు వీడని శివసేన
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి బీజేపీ శివసేనల మధ్య బహిరంగంగా కాకపోయినప్పటికీ అంతర్గతంగా విబేధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. శివసేన కేబినెట్లో మంత్రి పదవులు పంపకాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో సీఎం పదవి కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక్కడే రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. బీజేపీతో పొత్తుతోనే పోటీ చేశామని చెప్పిన సంజయ్ రౌత్... బీజేపీ మాటను నిలబెట్టుకోవాలని లేదంటే తాము ప్రత్యామ్నాయ మార్గాలకోసం వెతికేలా చేయొద్దని చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ పవిత్రులు కాదు అని చెబుతూ బీజేపీ మాట తప్పిందంటే తమ దారి తాము చూసుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు సంజయ్ రౌత్.