హర్యానా అసెంబ్లీ తాళం చెవి మావద్దే.. సీఎం పదవి ఇస్తేనే.. కింగ్ మేకర్గా దుశ్యంత్ చౌతాలా
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ దిశగా ప్రయాణిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రంగంలోకి దిగాయి. జేజేపీ పార్టీని దువ్వేందుకు నేతలు ప్రయత్నిస్తున్నాయి. దాంతో హర్యానా రాజకీయం రసకందాయంలో పడింది. ఈ క్రమంలో జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మాకు అభ్యంతరం లేదు
ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లభించని పరిస్థితుల్లో మాకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీతో ముందుకెళ్తాం. అది బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ మాకు అభ్యంతరం లేదు. మేము జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తాం. ఆ తర్వాత ఏ పార్టీతో కలిసి వెళ్లాలనేది పరిగణనలోకి తీసుకొంటాం. ఇప్పటి వరకు నేను ఏ పార్టీతో ఇంకా సంప్రదింపులు జరుపలేదు అని దుశ్యంత్ చౌతాలా అన్నారు.
కింగ్ మేకర్గా దుశ్యంత్ చౌతాలా
బీజేపీ రంగంలోకి దిగిన నేపథ్యంలో దుశ్యంత్ చౌతాలా తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్తో సిద్ధమనే సంకేతాలను పరోక్షంగా పంపుతూ రాజకీయ చతురతకు పదును పెట్టారు. సీఎం పదవి మాకు అప్పగిస్తే మేము కాంగ్రెస్తో కలిసి ముందుకు నడుస్తామని చెప్పారు. దాంతో హర్యానా రాజకీయం వేడెక్కింది.
అసెంబ్లీ తాళం మావద్దే..
హర్యానా అసెంబ్లీలో కీలకం మారిన నేపథ్యంలో జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ 40 సీట్లకు మించి దాటవు. హర్యానా అసెంబ్లీ తాళం బీజేపీ వద్ద లేదు.. కాంగ్రెస్ వద్దనూ లేదు. ఆ తాళం మా వద్ద ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో మా పాత్రే కీలకం అని చౌతాలా పేర్కొన్నారు. చౌతాలా ప్రస్తుతం ఊచన కలాన్ అసెంబ్లీ నుంచి గెలుపు బాట పట్టారు.
కడపటి వార్తలు అందేసరికి
హర్యానాలో కడపటి వార్తలు అందేసరికి బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యం.. 32 స్థానాల్లో కాంగ్రెస్, జేజేపీ 10, స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 10 ముందంజలో ఉన్నారు. దాంతో కర్ణాటక మార్కు రాజకీయాలు హర్యానాలో మొదలయ్యాయి. తక్కువ సీట్లు గెలుచుకొన్న పార్టీకి సీఎం పదవి ఇవ్వడానికి ప్రధాన పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.