కరోనా కల్లోలం వేళ.. వాతావరణంలో భయానక మార్పు: పగలే కమ్ముకున్న చీకట్లు
న్యూఢిల్లీ: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయి. దట్టమైన దుమ్ము తెరలు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. ఫలితంగా- నడి వేసవిలో పట్టపగలు కారు చీకట్లు కమ్ముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని మరీ తమ బండ్లను నడిపించాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొంది.
Recommended Video
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఆనుకునే ఉన్న గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్లల్లో ఇదే తరహా వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆదివారం ఉదయం 11 గంటల వరకు సాధారణంగా కనిపించింది ఢిల్లీ వాతావరణం. ఆ తరువాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా ఒక్కసారిగా దుమ్ము తెరలు అలుముకున్నాయి. ఎండ తీవ్రత సైతం ఏ మాత్రం కనిపించకుండా కప్పేశాయి.
#WATCH Dust storm envelops #Delhi in a sudden change of weather; Visuals from Gazipur area pic.twitter.com/GEot2byafd
— ANI (@ANI) May 10, 2020
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో తరచూ ఈ తరహా దుమ్ము తుఫాన్ లేదా దుమ్ము తెరలు నెలకొనడం సాధారణమే అయినప్పటికీ.. నడి వేసవిలో చోటు చేసుకోవడం పట్ల స్థానికుల్లో ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. బలమైన ఈదురుగాలులు వీయడం వల్ల రోడ్ల మీద చెత్తా చెదారం గాల్లోకి విసిరేసినట్లు ఎగిశాయి. ఢిల్లీతో సరిహద్దులను పంచుకుంటోన్న ఉత్తర ప్రదేశ్, హర్యానాల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించింది ఫరీదాబాద్, గుర్గావ్, రోహ్తక్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్లల్లో వాతావరణంలో మార్పులు సంభవించాయి.
అదే సమయంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదనట్లు తెలిపారు. మరి కొన్ని గంటల పాటు ఇదే తరహా వాతావరణం ఆయా ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. పశ్చిమ ప్రాంతంలో వాతావరణంలో నెలకొన్న భారీ మార్పుల ప్రభావం దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో పడినట్లు అభిప్రాయపడ్డారు.