రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
న్యూఢిల్లీ: రానున్న ఐదు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు, ఉరుములతో పాటు దుమ్ము తుఫాన్ కూడ సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తేల్చి చెప్పింది.
ఇప్పటికే దుమ్ము తుఫాన్తో ఉత్తరాదిన పలు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారీవర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు, దుమ్ముతుఫాను సంభవించవచ్చని అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కోస్తా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఉరుములతో కూడిన తుఫానులు, భారీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తాజా హెచ్చరికల ప్రకారంగా మే 10న ఉరుములతో కూడిన తుఫాను రావచ్చు. 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్ , సిక్కింలను తీవ్రమైన వడగాలులు ఉంటాయని చెప్పింది. . బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తర కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.ఈ రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
విదర్భ, ఒడిశాలో కూడా అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి , కేరళ దక్షిణ ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయి. మే 12 న ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తీరప్రాంత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్నాటక, కేరళ రాష్ట్రాలలో వేడి గాలులతో పాటు ఉరుములతో కూడిన గాలి తుఫాను సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 13న జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వేడిగాలులు, మే 14, సోమవారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రేదేశాల్లో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని ఐఎండీ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది.