ఢిల్లీ విద్యార్థి సంఘం ఎన్నికలు: విద్యార్థి ఎన్నికల్లో స్వీప్ చేసిన ఏబీవీపీ
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధంగా కొనసాగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఏబీవీపీ) ఘనవిజయం సాధించింది. మొత్తం నాలుగు స్థానాలకు పోటీపడగా ఏబీవీపీ మూడు పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక పోస్టును కైవసం చేసుకుంది.
ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల విధానం అవసరం లేదన్న నితిన్ గడ్కరీ..
ఏబీవీపీ తరపున బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థి అక్షిత్ దహియా, ఉపాధ్యక్ష అభ్యర్థి ప్రదీప్ తన్వార్, జాయింట్ సెక్రటరీ అభ్యర్థిగా శివాంగీ ఖర్వాల్లకు పోలైన ఓట్లలో అత్యధిక ఓట్లు వచ్చాయి. ఎన్ఎస్యూఐ నుంచి ఆకాష్ చౌదరి మాత్రమే గెలిచి ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ పోస్టును కైవసం చేసుకున్నాడు. షెడ్యూలు కంటే రెండు గంటలు ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. రావాల్సిన సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. అంతేకాదు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే స్క్రీన్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కూడా కౌంటింగ్ ముగిసే సరికి ఆలస్యమైంది.
ముందుగా ఒక ఈవీఎంనే లెక్కబెట్టారు. అనంతరం స్క్రీన్లు పనిచేయడం మొదలు పెట్టాక కౌంటింగ్ మిగతా ఈవీఎంలలో కూడా ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది 39.90శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతేడాది 44.46శాతం పోలింగ్ జరిగింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదన్న నిరసనల మధ్యే పోలింగ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. పోలింగ్కు 52 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు ఓటు వేసేందుకు అర్హత ఉంది. స్టూడెంట్స్ యూనియన్ పోల్స్కు 144 ఈవీఎంలను వినియోగించగా.. కాలేజ్ యూనియన్ పోల్స్కు 137 ఈవీఎంలను వినియోగించారు. గురువారం పోలింగ్ జరిగింది.
ఇక ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, కాలేజీకి సెలవులు రావడంతో ఈ సారి పోలింగ్ శాతం పడిపోయినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా గురువారం రోజున కాలేజీలకు సెలవు ప్రకటించడం జరిగింది. దీంతో చాలామంది విద్యార్థులు ఓటు వేసేందుకు రాలేదని కొందరు విద్యార్థి సంఘం నాయకులు చెప్పారు. కొన్ని కాలేజీ క్యాంపస్లలో మాత్రం భారీ క్యూలు కనిపించాయి. నార్త్ క్యాంపస్లో 400 మంది పోలీసులతో ప్రభుత్వం భద్రత చేపట్టింది.