కేజ్రీవాల్ ఘన విజయం: డైనమిక్ డజన్, ఢిల్లీ డైలాగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి డజన్ మంది నాయకుల అవిశ్రాంత శ్రమ ఉంది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు డజన్ మంది ప్రచార కమిటీ సభ్యులు నిరంతరం శ్రమించారు. కేజ్రీవాల్ నాయకత్వంలో 11 మంది పురుషులు, రిచా మిశ్రా పాండే అనే ఏకైక మహిళతో ఢిల్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడు నెలల ముందు ప్రచార కమిటీ ఏర్పాటైంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాలను రూపొందించే వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ప్రచార కార్యక్రమాలను రూపొందించడంతో పాటు ఢిల్లీ డైలాగ్ పేరిట ప్రజలతో చర్చాగోష్టులు నిర్వహించింది. ఈ చర్చాగోష్టుల సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను పార్టీ నాయకత్వం దృష్టికి, అభ్యర్థుల దృష్టికి తీసుకుని వెళ్లింది. దీంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని అభ్యర్థులు కూడా ఖరారు చేసుకోవడానికి వీలైంది.
ఏ ప్రాంత ప్రజలు ఏ విధమైన సమస్యలను ఎదుర్కుంటున్నారో, వాటికి సూచించాల్సిన పరిష్కారాలేమిటో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు తెలియజేయడంతో పాటు ప్రజలతో ఎలా కలిసి పోవాలో సూచించడంలో ఈ కమిటీ సంపూర్ణంగా విజయం సాధించింది. అలాగే ఎన్నికల ప్రచారంోబ ప్రత్యర్థి పార్టీలు ఏ విధమైన విమర్శలు చేస్తున్నారో గమనిస్తూ మీడియా ముందు వాటిని ఎలా తిప్పికొట్టాలో కూడా పార్టీ అధికార ప్రతినిధులకు ఆ కమిటీ సూచనలు చేస్తూ వచ్చింది.
ప్రచార కమిటీలని 12 మందిలో కొంత మంది సభ్యులు ప్రజలకే కాకుండా పార్టీ క్రియాశీలక సభ్యులకు కూడా అంతగా తెలియదు. 2007లో కాంగ్రెసు పార్టీని వదిలేసి కేజ్రీవాల్ పిలుపు మేరకు పార్టీలో చేరిన ఆశిష్ తల్వార్ పెద్దగా ప్రజలకు తెలిసినవారు కారు. అయినా, ఆయన పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అలాగే బిబిసి మాజీ జర్నలిస్టు నాగేందర్ శర్మ పార్టీ మీడియా విధానాన్ని రూపొందించారు. పోలింగ్ కేంద్రాల కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పట్ల అబిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో విశేష పాత్ర నిర్వహించిన దుర్గేష్ పాఠక్ కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కమిటీలోని సభ్యులు ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించారు.
అభ్యర్థుల ఎంపికకు ముందు ప్రతి నియోజకవర్గంలో ముందస్తు సర్వే నిర్వహించారు. ఎవరిని అభ్యర్థిగా నియమిస్తే విజయావకాశాలు ఉంటాయో శాస్త్రీయంగా విశ్లేషించి, అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రతిఫలింపజేయడంలో విజయం సాధించారు. ఐ విషయంలో కమిటీ కృషి విశేషంగా ఉంది.
గత ఎన్నికల్లో మాదిరిగా భారీ ప్రచార సభల ఏర్పాటుకు కూడా వెళ్లకుండా ఐదారు వేల మంది ఓటర్లు హాజరయ్యేలా చూసి వీధి ప్రచార సభలను ఏర్పాటు చేసి, వాటిన్నింటినీ ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించేలా చేశారు. ఇది చాలా కలిసి వచ్చింది.