అదే పెద్ద శత్రువు: వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకిలించివేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంగళవారం జాతీయ యువ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ.
ఇంటిపేర్లతో రాజకీయాల్లో ఇంకేన్నాళ్లూ..
యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అయితే, ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలుస్తోన్న వారి భవిష్యత్తు మాత్రం క్రమంగా తగ్గిపోతోందని వారసత్వ రాజకీయాలపై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు కుటుంబ రాజకీయాలేనని, ఆ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందన్నారు.
వారసత్వ రాజకీయాలే దేశానికి ప్రధాన శత్రువు..
వారసత్వ రాజకీయ నేతలకు దేశమే ప్రథమ ప్రాధాన్యం కాదన్నారు. కేవలం వారి కుటుంబాలను రక్షించుకోవడానికే ఇలాంటివారు రాజకీయాల్లో కొనసాగుతున్నారన్నారు. దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఈ వ్యాధి కూడా ఒకటని అన్నారు. వీటికి చరమగీతం పాడాలసిన అవసరం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అందుకే యువకులు పార్లమెంటులో అడుగుపెట్టాలని సూచించారు.
యువతకు మేలు చేసే ప్రభుత్వం ఉంది..
జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలని, అదే సమయంలో శారీరక, మానసిక దృఢత్వం అవసరమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను కూడా ఆయన గుర్తు చేశారు. వివేకానందుడు చూపిన మార్గం మన ముందుందన్నారు. దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇక కేవలం నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చేవారు మాత్రమే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని, అలాంటివారికి రాజకీయాల్లో కొనసాగుతారని ప్రధాని అన్నారు.
దేశ ప్రజలకు రాజకీయాలపై పూర్తి అవగాహన...
రాజకీయాల్లో మార్పు రాదంటూ కొందరనే మాటల్లో వాస్తవం లేదని, ప్రజలు దేశానికి మేలు చేసేవారిని ఎన్నుకుంటారని ప్రధాని మోడీ చెప్పారు. వారసత్వ రాజకీయాలను, అవినీతి ప్రభుత్వాలను దేశ ప్రజలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సాధారణ పౌరులు కూడా రాజకీయాల పట్ల మంచి అవగాహన కలిగిఉన్నారని చెప్పారు. కాగా, పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గురు జాతీయ విజేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.