ఈ-సిగరేట్లతో ఆరోగ్యానికి చేటు.. లతా మనందరీ ‘దీదీ’... మన్కీ బాత్లో మోడీ
ఈ-సిగరేట్లతో యువతపై పెను ప్రభావం చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వాటి బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ-సిగరేట్లను దేశంలో నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా రేడియోలో మోడీ ముచ్చటించారు.
ఆరోగ్యానికి చేటు
ఈ-సిగరేట్లు అనేవి ఆరోగ్యానికి హానికరమని మోడీ పేర్కొన్నారు. కానీ యువత మాత్రం ఈ-సిగరేట్లతో హానీ జరగదనే భ్రమలో ఉన్నారని గుర్తుచేశారు. వాస్తవానికి పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. దీంతో క్యాన్సర్, షుగర్, బీపీ.. ఇతర జబ్బులు వస్తాయని పేర్కొన్నారు. పొగాకులో నికొటిన్ ఉండటమే కారణమని మోడీ తెలిపారు. యువత ఆరోగ్యంపై నికొటిన్ చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అదీ మానసిక పరిస్థితిపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోందని చెప్పారు.
డేంజర్ బెల్స్..
ఈ-సిగరేట్లు అత్యంత ప్రమాదకరమని మోడీ గుర్తుచేశారు. ఇంట్లో యువత, పెద్దలు ఈ-సిగరేట్లు తీసుకుంటే.. పక్కనే ఉన్న చిన్నపిల్లలు ట్రై చేస్తే పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. అన్నీ ఆలోచించే ఈ-సిగరేట్లపై నిషేధం విధించామని పేర్కొన్నారు. ఈ-సిగరేట్లు కొనుగోలు, విక్రయం, ఎగుమతి, ఉత్పత్తి, నిల్వ అన్నింటిపై నిషేధం విధించామని గుర్తుచేశారు. ఎవరి వద్దనైన ఈ-సిగరేట్లు ఉంటే రూ.5 లక్షల ఫైన్ వేస్తామని పేర్కొన్నారు. మూడేళ్ల జైలుశిక్ష కూడా తప్పదని మోడీ హెచ్చరించారు.
ఈ సిగరేట్లు అంటే ఏంటీ ..?
సిగరేట్లో పొగాకు ఉంటే ఈ-సిగరేట్లో ద్రవపదార్థం ఉంటుంది. దీనిని ఆవిరిగా మార్చేందుకు బ్యాటరీ ఉంటుంది. దీని సాయంతో ఆవిరిని పీలుస్తూ ఆనందిస్తారు. అంతేకాదు ఇవీ స్ట్రాబెర్రీ, రూట్ బీర్, చాయ్, టీ, మెంథాల్ వంటి ప్లేవర్లలో కూడా లభించేవి. కానీ ఇవి సిగరేట్ల కంటే ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు నిర్ధారించారు. భారత్తోపాటు ఇప్పటికే 30 దేశాలు ఈ సిగరేట్ను నిషేధించాయి.
మన దీదీ ‘లతా మంగేష్కర్'
మరోవైపు దేశ ప్రజలందరూ ప్రముఖ గాయనీ లతా మంగేష్కర్ను గౌరవించాలని ప్రదాని మోడీ కోరారు. అందరి కన్న వయస్సులో పెద్ద అయిన ఆమెను దీదీ అని పిలువాలన్నారు. లతా మంగేష్కర్ నిన్న 90వ ఏట అడుగిడిన సంగతి తెలిసిందే. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు మోడీ తెలిపారు. దేశంలోని చాలామందికి లతా మంగేష్కర్ ఆదర్శనీయమని మోడీ గుర్తుచేశారు.