టెక్కీల ఇళ్లే టార్గెట్: వరుస చోరీలతో రెచ్చిన దొంగల ముఠా, ఆటకట్టించిన పోలీసులు
బెంగళూరు: నగరంలో మరో దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు నివాసముండే గృహాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న పంజాబ్కు చెందిన ఓవ్యక్తితోపాటు ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి రూ.42 లక్షల విలువ చేసే 1.89 కిలోల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, 17 ల్యాప్టాప్లు, ఐదు కెమేరాల్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును బెంగళూరులో అదనపు పోలీసు కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ సొంతదారులకు అందజేశారు.
కెమెరాల సాయంతో..
జలంధర్ నివాసి సుమీర్ శర్మ(32) దొంగసొత్తును కొనుగోలు చేస్తున్న రామబాబు(48)లను అరెస్టు చేసినట్లు సీపీ సీమాంత్ కుమార్ సింగ్ తెలిపారు.
బెంగళూరు, బేగూరు, కోరమంగల, హుళిమావు ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులకు చెందిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నేరానికి పై ఇద్దరిపై కన్నేశామన్నారు. పలు ప్రాంతాల్లోని నిఘా కెమేరాలను పరిశీలించి వాటి ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలిపారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇళ్లే లక్ష్యంగా
ఉన్నత చదువుల కోసం సమీర్శర్మ 2005లో నగరానికి వచ్చాడు. బీకాం పూర్తి చేసిన ఆయన చామరాజపేటలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. జీవనం కోసం హొసకెరెహళ్లిలో కంప్యూటర్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించాడు. తనతో పాటు చదువుతున్న రుషికా అనే యువతిని పెళ్లాడాడు. కాగా, చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఇళ్లలో దొంగతనాలు పాల్పడేందుకు ప్రయత్నించాడు.
ఇక వరుస పెట్టి దొంగతనాలు
ఒకటి రెండు దొంగతనాలు విజయవంతం కావడంతో ఇక అదే పనిని కొనసాగించాడు. 2017లో దుండగుడ్ని అరెస్టు చేసి రూ.72లక్షల విలువ చేసే 151 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు గుర్తించి మరోసారి అరెస్టు చేశారు.
విషాదంలో ఉన్న ఇంట్లో కూడా చోరీ
ఇది ఇలా ఉండగా, చిత్రదుర్గ జిల్లా హొన్నూరుకు చెందిన కూలీ కార్మికుడు తిప్పేస్వామి కుమారులు అర్జున్ (7), మంజునాథ్ (9) ప్రమాదవశాత్తు ఇటీవల బెంగళూరు శివారు కోడిచిక్కనహళ్లి సమీప నీటి గుంతలో పడి మృతి చెందారు. దీంతో పాలికె నుంచి ఆ కుటుంబానికి ఫిబ్రవరిలో రూ.2లక్షల నగదు సాయం అందింది. నగదు ఇంట్లో ఉంచి ఆ దంపతులు కూలీ పనులకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన సమీర్ శర్మ.. తిప్పేస్వామి ఇంటి తాళాల్ని పగలకొట్టి రూ.2లక్షల నగదు, తొమ్మిది గ్రాముల బంగారు నగల్ని దొంగిలించాడు. ఈ నేరం రుజువైంది. దీంతో శమీర్ శర్మ నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. సులభంగా సంపాదించి, విలాస జీవితం గడపాలనే యావతోనే నిందితుడు ఇలా చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.