ముందడుగు: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఈ-కామర్స్ సైట్లు విరాళాల సేకరణ
దేవుని సొంత దేశంగా పిలువబడే కేరళ రాష్ట్రం ఇప్పుడు నరకాన్ని చూస్తోంది. పర్యాటకానికి సర్వధామంగా నిలిచిన ఈ మళయాళీ రాష్ట్రం నేడు సహాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రకృతి ప్రకోపానికి అందమైన ప్రదేశం అందవిహీనంగా మారింది. ఎటు చూసిన వరద నీరే దర్శనమిస్తూ ఓ దీవిలా కనిపిస్తోంది. ఇక అక్కడి ప్రజల విషయానికొస్తే ఆకలితో అలమటిస్తున్నారు. కాలు తీసి కాలు పెట్టేలా కూడా పరిస్థితి లేదు. ఎవరైనా రాకపోతారా... తమ కడుపులు నింపకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సహాయక చర్యలకు మాత్రం వరణుడు అడ్డుగా నిలుస్తున్నాడు.
ఇక కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ముందుకు కదిలాయి. విరాళాలు సేకరించి వరదబాధితులకు అందజేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ గూంజ్ అనే ఎన్జీఓ సంస్థతో జతకట్టింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా డబ్బులను విరాళంగా ఇస్తే... అక్కడి నుంచి గూంజ్ సంస్థ బాధితులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తుంది. దుప్పట్లు, దోమతెరలు, రేషన్, టాయ్లెటరీస్, వంట పాత్రలు లాంటివి కొనుగోలు చేసి బాధితులకు ఇస్తుంది. విరాళాలు ఇవ్వాలనుకునే వారు మీ ఫోనులో ఫ్లిప్ కార్ట్ యాప్ ఓపెన్ చేసి అక్కడ కేరళ డొనేషన్స్ అనే బ్యానర్ ఐటెం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడే మీ విరాళాలు గూంజ్ సంస్థకు ఇవ్వొచ్చు. ఇక్కడ మీరు చేసిన విరాళాలన్నిటిపై 50శాతం టాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సర్టిఫికేట్కూడా మీకు కొన్ని రోజుల్లో అందుతుంది.
అమెజాన్ ఇండియా
అమెజాన్ సంస్థ కూడా గూంజ్ సంస్థతో పాటు మరో రెండు సంస్థలతో టైఅప్ అయ్యింది. హ్యాబిటెట్ ఫర్ హ్యూమానిటీ ఇండియా, వరల్డ్ విజన్ ఇండియాతో జతకట్టింది. ఇక్కడ బ్యానర్ యాడ్ మీద క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడే మూడు సంస్థలు కనిపిస్తాయి. మీరు ఏసంస్థకు విరాళం ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు డబ్బులను విరాళంగా ఇవ్వొచ్చు.
ఇదిలా ఉంటే పేటీఎం కేరళ సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్తో జతకట్టింది. దీని ద్వారా డబ్బులను వరద బాధితులకు విరాళంగా ఇవ్వొచ్చు. యాప్లో keral.floods icon అనే దానిపై క్లిక్ చేస్తే మరో పేజీకి మిమ్మలను తీసుకెళుతుంది. అక్కడ మీ సమాచారం పూర్తి చేసి విరాళాన్ని ఇవ్వొచ్చు. అయితే ఇక్కడ మాత్రం పన్ను మినహాయింపు పేటీఎం ఇవ్వడంలేదు. అయితే ప్రతి రూపాయికి లెక్కచెబుతామనే భరోసా మాత్రం ఇస్తోంది.
బిగ్ బాస్కెట్:
ఎన్జీఓ గూంజ్ సంస్థ బిగ్ బాస్కెట్తో కూడా జతకట్టింది. బ్యానర్ యాడ్ పై క్లిక్ చేయగానే మరో ప్రత్యేక పేజ్ ఓపెన్ అవుతుంది. బిగ్ బాస్కెట్లోకి వెళ్లి మీరు విరాళంగా ఇవ్వదలుచుకున్న రేషన్ పై క్లిక్ చేసి ఇవ్వొచ్చు. ప్రస్తుతానికి బియ్యం, చక్కెర, కందిపప్పు మాత్రమే బిగ్ బాస్కెట్ ద్వారా విరాళంగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాను మరింత పెంచుతామని బిగ్ బాస్కెట్ యాజమాన్యం తెలిపింది.
ఇలా ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు తమ మొబైల్ యాప్ ద్వారా కేరళ వరదబాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచి ఐడియా అని పలువురు ఆన్లైన్ షాపర్స్ ప్రశంసిస్తున్నారు.