ఐదుగురిని కనండి: హిందువులకు సింఘాల్ సూచన
భోపాల్: విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్ అశోక్ సింఘాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందువు ఐదుగురు పిల్లలను కనాలని ఆయన సూచించారు. మత మార్పిడులను ఆపకపోతే హిందువులు మైనారిటీలో పడిపోక తప్పదని ఆయన అన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రతి హిందువు ఐదుగురు పిల్లలను కనడం తప్పనిసరి అవుతుందని ఆయన అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆయన ప్రశంసల జల్లు కురుపించారు. పలు విషయాలపై ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్సలు గుప్పించారు.
నరేంద్ర మోడీ ప్రధానిగా ఏర్పడే ప్రభుత్వం ఏ వైపు నుంచి కూడా, అమెరికా వైపు నుంచి కూడా ఒత్తిడికి గురి కాదని ఆయన అన్నారు. బిజెపితో తమకు ఏ విధమైన సంబంధం లేదని, అయితే వచ్చే లోకసభ ఎన్నికల్లో మోడీని తప్పకుండా బలపరుస్తామని సింఘాల్ చెప్పారు.
విహెచ్పి కన్వీనర్ అశోక్ సింఘాల్ గత రాత్రి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగాయి.