ఢిల్లీపై ప్రకృతి కూడా పగబట్టిందా?: మరో ఉత్పాతం: దుమ్ము తుఫాన్ చెలరేగిన కొద్ది సేపటికే.. భూకంపం
న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న దేశ రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పులు ఢిల్లీ ప్రజలు ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సమయంలోనే.. పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ భూ ప్రకంపనలతో ఢిల్లీవాసులు భయాందోళనలకు గురి అయ్యారు. ఇళ్లను విడిచి బయటికి పరుగులు తీశారు.
Recommended Video
ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని వజీరాబాద్ను భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతున భారీ భూకంపం సంభవించిందని, దాని ప్రభావం వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకంపనల ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. కొన్ని సెకెన్ల పాటు ప్రకంపనలు నమోదు అయ్యాయి. వజీరాబాద్, బగియాబాద్, ఝరోడా, జగత్పూర్, ముఖర్జీ నగర్, ఆజాద్ పూర్, తిమార్పూర్, షాలిమార్ బాగ్, పశ్చిమ విహార్, జనక్పురి, రోహిణి వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు నమోదు అయ్యాయి.
దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించ లేదని ప్రాథమిక సమాచారం. వజీరాబాద్ పరిసర ప్రాంతంలో మాత్రమే దీని తీవ్రత అధికంగా కనిపించిందని, మిగిలిన ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు- న్యూఢిల్లీలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయి. దట్టమైన దుమ్ము తెరలు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. ఫలితంగా- నడి వేసవిలో పట్టపగలు కారు చీకట్లు కమ్ముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని మరీ తమ బండ్లను నడిపించాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొంది.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఆనుకునే ఉన్న గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్లల్లో ఇదే తరహా వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆదివారం ఉదయం 11 గంటల వరకు సాధారణంగా కనిపించింది ఢిల్లీ వాతావరణం. ఆ తరువాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమంగా ఒక్కసారిగా దుమ్ము తెరలు అలుముకున్నాయి. ఎండ తీవ్రత సైతం ఏ మాత్రం కనిపించకుండా కప్పేశాయి. ఆ వెంటనే- భూకంపం సంభవించడం వల్ల ఢిల్లీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒకవైపు కరోనా.. మరోవైపు వాతావరణం, ఇంకోవంక భూకంపంతో ముప్పేటదాడిని ఎదుర్కొన్నారు.