తెల్లవారుజామున భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు... రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత...
రాజస్తాన్లోని బికనీర్లో గురువారం(అగస్టు 13) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. బికనీర్కు పశ్చిమాన 669 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని... భూమికి 30కి.మీ లోతు నుంచి భూకంపం సంభవించిందని వెల్లడించింది.
తెల్లవారుజామున భూ ప్రకంపనలతో నిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడి లేచి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ,ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఉత్తర భారతదేశంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
బుధవారం(అగస్టు 12) మణిపూర్లోని చందెల్ జిల్లాలోనూ సాయంత్రం 7.27గం. సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించలేదు. మొయిరంగ్ పట్టణానికి నైరుతి దిశగా 43 కి.మీ దూరంలో భూమిలో 15కి.మీ లోపల భూకంపం సంభవించినట్లు గుర్తించామని సీస్మోలజీ కేంద్రం తెలిపింది. అంతకుముందు, జూన్ 21న మిజోరాం సమీపంలోని గోప ప్రాంతంలోనూ భూకంపం సంభవించింది.అరుణాచల్ ప్రదేశ్లో మంగళవారం(అగస్టు 11) రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది.
ఉత్తర భారతదేశం విషయానికొస్తే... ఒక్క ఢిల్లీలోనే 3 నెలల వ్యవధిలో పలుమార్లు భూకంపాలు సంభవించాయి.ఏప్రిల్ 12 నుంచి జులై 3 వరకూ దాదాపు 20 సార్లు ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాల తీవ్రత పరంగా భారత్ II, III, IV, V అనే నాలుగు సీస్మిక్ జోన్లుగా విభజించపడి ఉంది. ఇందులో ఢిల్లీ హైరిస్క్ జోన్ IV పరిధిలో ఉన్నది.