అండమాన్లో స్వల్ప భూకంపం, 135కిమీ దూరంలో కేంద్రం
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబర్ దీవుల్లో శుక్రవారం నాడు మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్కు సమీపంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 5.4గా ఉంది. పోర్ట్ బ్లెయిర్కు 135 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. గత శనివారం నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అండమాన్లో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది.
100 మందిని రక్షించిన ఆస్ట్రేలియా వైమానిక దళం
నేపాల్లో చిక్కుకుపోయిన 100మందిని రాయల్ ఆస్ట్రేలియా వైమానిక దళం రక్షించింది. వీరిలో 60మంది ఆస్ట్రేలియా దేశస్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం నేపాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెండు విమానాలు, బాధితుల కోసం 15 టన్నుల టార్పాలిన్లు, మందులు, దుప్పట్లు పంపించింది.
నేపాల్ పెనుభూకంపంలో ముమ్మరమైన సహాయ చర్యలు సాగుతున్నాయి. వరుస ప్రకంపనలతో సహాయ చర్యల వేగం తగ్గిన నేపథ్యంలో మృతుల సంఖ్యా పెరుగుతోంది. నేపాల్లోని అనేక జిల్లాల్లో పరిస్థితిని బట్టి చూస్తే మృతుల సంఖ్య దిగ్భ్రాంతికర రీతిలో పదివేలకు పెరిగే అవకాశముందంటున్నారు.