ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం: భయంతో బయటికి పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: బీహార్, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.5గా నమోదైందని అధికారులు తెలిపారు. సుమారు 15నుంచి 20సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రం అసోంలోని కోక్రఝర్ నగరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు షిల్లాంగ్లోని కేంద్రీయ భూకంపాల అధ్యయన సంస్థ ప్రకటించింది. పశ్చిమబెంగాల్లో ఏకంగా ఆరు జిల్లాల్లోని ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది.
భూ ప్రకంపనలతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఆస్తి నష్టం జరిగిందా? అనే విషయంపై సమాచారం లేదు.
బుధవారం ఉదయం 5.15గంటలకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 4.6గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత 5.43గంటలకు హర్యానాలోని ఝాజ్జర్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.