గుజరాత్: రాజ్కోట్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం, జనం పరుగులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్కోట్, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాజ్కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
Recommended Video
రిక్టారు స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా, భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
భూకంపం సంభవించినట్లు తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజ్ కోట్, కచ్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిపై సమీక్షించారు.
ఇది ఇలావుంటే, టర్కీలో కూడా 20 నిమిషాలపాటు భూకంపం సంభవించినట్లు తెలిసింది.