Earthquake: వణికిన ఈశాన్య రాష్ట్రాలు: అస్సాం సహా పలు చోట్ల ప్రకంపనలు.. !
న్యూఢిల్లీ: అస్సాంలో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు అస్సాం సహా మేఘాలయ, మిజోరం, పశ్చిమ బెంగాల్ ఉత్తరాది ప్రాంతాలు వణికిపోయాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి వార్తలు కూడా అందలేదు. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు, ఇతర భవనాలు బీటలు వారినట్లు తెలుస్తోంది.
ఈ సాయంత్రం 6:17 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. మేఘాలయలోని తుర ప్రాంతానికి ఈశాన్య దిశగా 100 కిలోమీటర్లు, అస్సాంలోని బొంగైగావ్ జిల్లా అభయాపురికి 16 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలం నుంచి కనీసం 10 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న ఫలకాల మార్పుల వల్ల భూకంపం సంభవించినట్లు జాతీయ సెస్మాలజీ కేంద్రం వెల్లడించింది.
భూమి అంతర్భాగంలో చోటు చేసుకోవడం వల్ల ఉపరితలంపై దాని తీవ్రత స్థాయి తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ.. 5.0 తీవ్రతతో భూకంపం నమోదు కావడం ప్రమాదకరంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గౌహతి, షిల్లాంగ్, తురా, జల్పాయ్ గురి, కూచ్ బెహార్, అలీపూర్ దౌర్ వంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటిని గుర్తించిన వెంటనే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తమ నివాసాలు, కార్యాలయాల నుంచి బహిరంగ ప్రదేశాలకు పరుగులు తీశారు.